న్యూదిల్లీ: టీ20 ప్రపంచకప్లో అఫ్గానిస్థాన్ జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలైన అఫ్గాన్, తాజాగా యూఏఈపై ఘన విజయం సాధించింది. గ్రూప్ డీలోభాగంగా సోమవారం దిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని అఫ్గాన్ జట్టు 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇబ్రహీం జర్దాన్ (53 పరుగులు), అజ్ముతుల్లా ఒమర్జాయ్ (40 పరుగులు) రాణించారు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్ధిఖీ 2, మహ్మద్ అర్ఫాన్ చెరో 2, మహ్మద్ జువాదుల్లా 1 వికెట్ పడగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో9 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. షోయబ్ ఖాన్ (68 పరుగులు) అర్ధ సెంచరీతో రాణించగా, అలిశన్ షరఫు (40 పరుగులు) ఆకట్టుకున్నాడు. అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 4, ముజీబ్ అర్ రెహ్మాన్ 2, రషీద్ ఖాన్ 1 వికెట్ పడగొట్టారు. కాగా, ఈ మ్యాచ్లో అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో అర్ఫాన్ వికెట్ తీయడంతో టీ20ల్లో 700 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్గా నిలిచాడు. ఇందులో ఆయా దేశాల లీగుల్లో, అంతర్జాతీయ టీ20 క్రికెట్లో కలిపి ఈ వికెట్లు సాధించాడు. టీ20 క్రికెట్లో 700 వికెట్ల మైలురాయి అందుకున్న ఏకైక బౌలర్గా రషీద్ నిలిచాడు. ఇక ప్రస్తుత టోర్నమెంట్లో గ్రూప్ డీలో ఉన్న అఫ్గాన్ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ను ఢీ కొట్టింది. ఆ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఓడింది. తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో తీవ్రంగా పోరాడి గెలుపు అంచులదాకా వెళ్లి ఓడింది. రెండో సూపర్ ఓవర్లో 5 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలిచింది.


