. పంచాయతీరాజ్ చట్టం, మున్సిపల్ చట్టాల్లోనూ సవరణలు
. కేబినెట్ కీలక నిర్ణయం
విశాలాంధ్ర – హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లలు ఉన్నవారు ఎన్నికల్లో పోటీకి అనర్హులు అనే నిబంధనను తొలగించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం… ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ నిబంధన వల్ల ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లలు ఉన్న అనేక మంది ఆశావహులు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, ఈ నిబంధనను తొలగించాలని తీర్మానించింది. ఈ నిర్ణయాన్ని వేగంగా అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ తీసుకురానుంది. దీని ద్వారా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018తో పాటు, మున్సిపల్ చట్టాల్లోనూ అవసరమైన సవరణలు చేయనున్నారు. ముఖ్యంగా, పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 21(3)ను పూర్తిగా తొలగించాలని కేబినెట్ స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయం ప్రజా స్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేస్తుందని, మరింత మందికి ప్రజాప్రతినిధులుగా పనిచేసే అవకాశం కల్పిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఈ సవరణలు పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.


