పొంగులేటి
విశాలాంధ్ర – హైదరాబాద్: నీళ్లు… నిధులు… నియామకాల ప్రాతిపదికన ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గ్రూప్-2 ద్వారా ఎంపికై స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ శాఖలో సబ్ రిజిస్ట్రార్లుగా నియమితులైన 14 మందిని గురువారం సచివాలయంలో మంత్రి మర్యాద పూర్వకంగా కలిసి వారిని అభినందిం చారు. ఈ సందర్భంగా వారికి ఇండియన్ స్టాంప్ యాక్ట్ బుక్ లను అందజేశారు. మంత్రి మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా కొత్త ఉద్యోగాలను సృష్టించడం అటుంచి, ఉద్యోగ నియామక ప్రక్రియలలో చూపిన అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగ యువత ఆశలు అడుగంటిపోయాయని విమర్శించారు. పేపర్ లీకేజీలు, అసమర్థ్ద పరీక్షా నిర్వహణ వల్ల అర్హులైన యువతకు ఉద్యోగాలు రాని పరిస్థితి దాపురించిందన్నారు. 20 నెలల పాలనా కాలంలో ఇప్పటి వరకు సుమారు 70 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ జరిగిందని వివరించారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలన్న ఆలోచన మేరకు వివిధ శాఖల తరపున కార్యాచరణను విస్తృతం చేశామని మంత్రి పొంగులేటి చెప్పారు. రెవెన్యూ శాఖలో జీపీవోల నియామకం, హౌసింగ్ విభాగంలో అవుట్ సోర్సింగ్ పద్దతిలో దాదాపు 350 మంది ఇంజినీర్లు, 3,465 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పారు. సామాన్య ప్రజలే లక్ష్యంగా సేవలు అందించాలని, తద్వారా ఉద్యోగానికి న్యాయం చేసి ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు తేవాలని సూచించారు. ఎటువంటి ప్రలోభాలకు తలొగ్గకుండా నిజాయితీ, నిబద్దత అంకితభావం, క్రమశిక్షణతో పనిచేయాలన్నారు. రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అంకితభావంతో పనిచేయండి
- Advertisement -


