ఇందిరమ్మ ఇళ్లకు సీతక్క భూమిపూజ
విశాలాంధ్ర బ్యూరో- ములుగుజిల్లా: ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రంలో ప్రతి పనిని చిత్తశుద్ధితో పూర్తి చేస్తున్నామని మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. తాను ములుగు నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ దశలవారీగా పూర్తి చేయడానికి కృషి చేస్తున్నట్టు స్పష్టం చేశారు. మంగపేట మండలం శనగకుంటలో సోమవారం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్తో కలిసి మంత్రి అగ్ని ప్రమాద బాధితులకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లకు ఆమె భూమి పూజ చేశారు. సీతక్క మాట్లాడుతూ గత ఏడాది అగ్నిప్రమాదంలో శనిగకుంటలోని కొన్ని కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయన్నారు. 300 స్వచ్ఛంద సంస్థల సహకారంతో వంట సామానులు, దుస్తులు అందజేసినట్టు చెప్పారు. బాధితుల్లో ఆత్మవిశ్వాసం కల్పించడానికి ఐటీడీఏ ద్వారా ఆర్థిక సాయం చేసినట్టు తెలిపారు. నేడు ప్రతి ఇంటి ఇంటికి నల్లాల ద్వారా మంచినీటిని అందించడం జరుగుతుందన్నారు. గతంలో తాను ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి, భూమి పూజ చేయడం సంతోషంగా ఉందన్నారు. వేసవిలో మంచి నీటి ఎద్దడి ఏర్పడకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కానీ పేదలు ఆందోళన చెందవద్దని, రెండవ దఫా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. లబ్ధిదారులకు త్వరితగతిన బిల్లులు చెల్లించడానికి కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర్ మాట్లాడుతూ శనిగకుంట గ్రామంలో మంత్రి ఆదేశాల మేరకు పూర్తిస్థాయిలో మంచినీటి సమస్యను తీర్చామని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో మధ్యవర్తులకు అవకాశం కల్పించడం లేదని స్పష్టం చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జి, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
దశలవారీ హామీల అమలు
- Advertisement -


