Thursday, June 26, 2025
Homeతెలంగాణవ్యవసాయం అంటేనే కాంగ్రెస్‌

వ్యవసాయం అంటేనే కాంగ్రెస్‌

9 రోజుల్లో 67.01 లక్షల మంది రైతులకు రూ.8,675 కోట్లు జమ
సన్నధాన్యం బోనస్‌గా రూ.1,199 కోట్లు చెల్లింపు
ఇందిరా గిరి వికాసం పథకం కింద 2.1 లక్షల గిరిజన రైతులకు లబ్ధి
పీఏసీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి వెల్లడి

విశాలాంధ్ర`హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ అంటేనే వ్యవసాయం… వ్యవసాయం అంటేనే కాంగ్రెస్‌ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ, రైతన్నలకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ సరఫరా, పెట్టుబడి సాయం కింద రైతు భరోసా, సన్నాలు సాగు చేసిన రైతులకు రూ.500 బోనస్‌, రైతు బీమా, పంట నష్టం జరిగితే పరిహారం, భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి వాటితో రైతన్నల కోసం దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. మంగళవారం గాంధీ భవన్‌లో నిర్వహించిన పీఏసీ సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఈ సీజన్‌లో పంటలకు పెట్టుబడి సాయం తొమ్మిది రోజుల్లో 67.01 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.8,675 కోట్లు జమ చేశామని వెల్లడిరచారు. రైతు భరోసా మూలంగా రాష్ట్రంలో సాగు యోగ్యమైన 1.49 కోట్ల ఎకరాలకు 69.70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.9 వేల కోట్లు జమచేసి ప్రజా ప్రభుత్వం రైతుల జీవితాల్లో ఓ భరోసాను నింపిందన్నారు. అన్నదాతల సంక్షేమం కోసం 24 గంటల ఉచిత విద్యుత్‌ పథకం కింద నెలకు రూ.900 కోట్ల చొప్పున అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు రూ.17,091 వేల కోట్లు రైతుల పక్షాన ప్రభుత్వం విద్యుత్‌ సంస్థలకు చెల్లించిందని తెలిపారు. ప్రభుత్వం అందించిన ఉచిత విద్యుత్‌ ద్వారా రాష్ట్రంలోని 29.40 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. రైతు భరోసా పథకం కింద నేటి వరకు 69.70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.21,763 కోట్లు జమ చేశామన్నారు. సన్న ధాన్యం సాగు చేస్తున్న రైతులకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్‌ రూపంలో ఇప్పటి వరకు 1,199 కోట్ల రూపాయలు రైతులకు ప్రజా ప్రభుత్వం చెల్లించిందన్నారు. రైతన్నకు ఊహించని ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని, ఈ పథకం కింద 42.16 లక్షల మందికి అందించామని చెప్పారు. భూమి లేని నిరుపేద రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద నేటి వరకు రూ.50 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇందిరా గిరి వికాసం పథకం కింద 2.1 లక్షల గిరిజన రైతులకు సోలార్‌ విద్యుత్‌తో నడిచే సాగునీటి పంపుసెట్లు, స్ప్రింక్లర్లు, డ్రిప్‌, ఉద్యాన శాఖ ద్వారా ఉచితంగా అవకాడో, వెదురు పామాయిల్‌ వంటి మొక్కలను గిరిజన రైతులకు అందిస్తున్నామని, ఇందుకుగాను రూ.12,600 కోట్లు కేటాయించామన్నారు. పూర్తిగా రైతన్నల కోసం చేపట్టిన కార్యక్రమాలతో ప్రతి సంవత్సరం రైతుల కోసం రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి వివరించారు. పాఠశాలలను 25 ఎకరాల్లో… రూ.200 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్నామని, మొదటి సంవత్సరం 58 పాఠశాలలు నిర్మించేందుకు రూ.11,600 కోట్లు కేటాయించామన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని అన్ని గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న 7.66 లక్షల మంది విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని డైట్‌ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్‌ చార్జీలు 200 శాతం పెంచామన్నారు. కోటి మంది మహిళలను ఐదు సంవత్సరాలలో కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని, మొదటి సంవత్సరం లక్ష్యాన్ని మించి రూ.21,632 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామన్నారు. ఇప్పటికే 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 30 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయనున్నామని, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ప్రక్షాళన చేసి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసామన్నారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్‌ యువ వికాసం పేరిట తొమ్మిది వేల కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు ఆయన వెల్లడిరచారు. రాష్ట్రంలోని 3.10 కోట్ల మంది పేదలకు ఉగాది నుంచి సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, ఇందుకుగాను ప్రజా ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.13,525 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. సామాన్య ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకొని మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు 188 కోట్ల ఉచిత ప్రయాణాలు మహిళలు చేశారని, ఆడబిడ్డల పక్షాన ప్రభుత్వమే ఆర్టీసీ సంస్థకు ఇప్పటి వరకు 4,310 కోట్ల రూపాయలు చెల్లించిందని చెప్పారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులయిన మహిళలకు 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీ చేస్తున్నామని, ఈ పథకం ద్వారా 42.90 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని, సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన రూ.580 కోట్లు ఇప్పటికే చెల్లించిందన్నారు. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నామన్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 50.77 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని, వారి పక్షాన ప్రభుత్వం విద్యుత్‌ సంస్థలకు 2,050 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించిందని చెప్పారు. 22,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రతి నియోజకవర్గానికి కనీసంగా 3,500 చొప్పున మొత్తం రాష్ట్రంలో 4.50 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు పెంచామని, ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో 90 లక్షలకు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు. ఇప్పుడున్న చికిత్సలే కాకుండా అదనంగా మరో 163 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చినట్లు వివరించారు. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేటి వరకు రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకానికి రూ.1,367 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని సాగునీటి పెండిరగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రాధాన్యత క్రమంలో వాటిని పూర్తి చేస్తామని, ఇందుకుగాను తాజా బడ్జెట్లో 23,373 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రాబోయే మూడేళ్లలో 17 వేల కిలోమీటర్ల గ్రామీణ రహదారులను రూ.28 వేల కోట్లతో అభివృద్ధి చేయనున్నామని అన్నారు. కొత్త పథకాలు కొనసాగించడమే కాకుండా గత ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ పథకాలను కూడా కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. కళ్యాణ లక్ష్మి పథకానికి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.3,022 కోట్లు విడుదల చేయగా 1,68,225 మంది లబ్ధి పొందారన్నారు. చేయూత పథకం కింద మన ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రూ.17,563 వేల కోట్ల ఖర్చు చేయగా 43.01 లక్షల మంది వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ఆర్థికంగా ప్రయోజనం పొందారని మంత్రి భట్టి విక్రమార్క వెల్లడిరచారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు