14 మంది మృతి,లక్ష మందికిపైగా నిరాశ్రయులు
థాయిలాండ్- కంబోడియా దేశాల మధ్య సరిహద్దు ఘర్షణల కారణంగా ఇప్పటివరకు 14 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, సుమారు లక్ష మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రజలంతా భయభ్రాంతులతో జీవితం గడుపుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పట్టుకుని తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఘర్షణలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. గురువారం రోజు థాయ్, కంబోడియా సైనిక దళాల మధ్య ఘర్షణలు తీవ్రమయ్యాయి. సరిహద్దు వద్ద ఫైరింగ్ జరగగా, ఈ సంఘటన టా మోన్ థోమ్ అనే ప్రాచీన ఆలయం వద్ద జరిగింది. ఈ ఆలయం థాయ్ల్యాండ్లోని సురిన్ ప్రావిన్స్ పరిధిలో ఉంది. ఈ ఫైరింగ్తో రెండు దేశాల్లోనూ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
ప్రభుత్వ ఆసుపత్రుపై షెల్లింగ్
ఈ ఘటనపై స్పందించిన థాయిలాండ్ ఆరోగ్య మంత్రి.. సురిన్ ప్రాంతంలోని ఓ ముఖ్యమైన ప్రభుత్వ ఆసుపత్రుపై షెల్లింగ్ జరిపినట్లు తెలిపారు. దీనిని యుద్ధ నేరంగా పరిగణించాలని ఆయన డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా సరిహద్దు ప్రాంతాల్లో ఈ రకమైన ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
గతంలో ఇదే సరిహద్దు వివాదం వల్ల థాయ్లాండ్ ప్రధాని ఏకంగా పదవిని కోల్పోయారు.


