మహిళలకు ఉచిత బస్సు పధకానికి నిరసనగా
నేడు ఆటో వర్కర్స్ పంద్రాగస్టు బహిష్కరణ
విశాలాంధ్ర – రాజమండ్రి సిటీ ; సూపర్ సిక్స్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రవేశ పెడుతున్న మహిళలకు ఉచిత బస్సు పధకానికి నిరసనగా తామంతా పంద్రాగస్టును బహిష్కరిస్తున్నట్లు జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ ప్రకటించింది. మహిళలకు ఉచిత బస్సు వల్ల రాష్ట్రంలో ఉన్న మినీ ట్రాన్స్ పోర్టు, ఆటో ట్రాన్స్ పోర్టు, ట్రావెల్స్కు తీవ్ర విఘాతం కలుగుతుందని, దీని వల్ల తమ జీవనోపాధిని కోల్పోతామని యూనియన్ ప్రకటించింది. ఈ క్రమంలో మోటార్ వాహనాల మీద ఆధార పడి ఎవరైతే జీవిస్తున్నారో వారంతా ఉపాధి కోల్పోతారని, వారితో పాటు ఆయా ఆటో వర్కర్ల కుటుంబాలు కూడా వీధిన పడతాయన్నారు. ఈ ఉచిత బస్సు పధకం వల్ల నెలకు 120 కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, ఇంత భారం భరించి పెట్టే ఈ ఉచిత పధకం వల్ల పెద్దగా ఒరిగేది ఏదీ ఉండదన్నారు. అదే డబ్బును ఏ నిత్యావసర వస్తువులు తగ్గించడానికో చేస్తే మధ్యతరగతి వారికి మేలు చేసినవారవుతారన్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపించకుండా ప్రవేశ పెడుతున్న ఈ ఉచిత బస్సు పధకాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, దీనికి నిరసనగా ఈనెల 15వ తేదీన పంద్రాగస్టును బహిష్కరిస్తున్నామన్నారు.
జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్ మాట్లాడుతూ, ప్రజా సంక్షేమాన్ని కోరే ఏ ప్రభుత్వం ఇలాంటి అనాలోచితమైన పనులు చేయదని, మహిళలకు ఉచిత బస్సు పధకం వల్ల లక్షలాది మంది
ఆటో వర్కర్స్ రోడ్డున పడతారన్నారు. ఈరోజున తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో ఈ ఉచిత పధకాన్ని పెట్టారని, దీని వల్ల కార్మికులకు జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కనుక అర్ధం పర్దం లేని ఈ ఉచిత బస్సు పధకాన్ని ప్రవేశ పెట్టి లక్షలాది మంది జీవితాల కళ్ళల్లో నీళ్ళు చూడవద్దని, ఇలాంటి నిరంకుశమైన పనులు చేసే ఏ ప్రభుత్వమైనా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. గతంలో జగన్ ప్రభుత్వం ప్రతి ఆటో డ్రైవర్ కు పది వేల చొప్పున ఆర్ధిక సహాయం అందించిందని, కానీ నేడు కూటమి ప్రభుత్వం ఆటో వర్కర్స్ కు చేయూతనివ్వకపోగా, వారి మీద అనేక విధాలుగా భారాలు మోపుతుందని, నేడు ఉచిత బస్సు పధకాన్ని అమలు పరచి కార్మికుల జీవనోపాధిని దెబ్బదీస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ ఆలోచనను విరమించుకోవాలని, లేదా ఆటో వర్కర్స్ కు ప్రత్యామ్నాయం చూపించాలని ఆయన డిమాండ్ చేశారు.


