ఈ ఏడాది ఉత్తర భారతదేశం భారీ వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. కౌడ్ల బరస్ట్ కారణంగా జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాలు ఘోర నష్టానికి గురయ్యాయి. అంతేకాదు, రావి నది ఉధృతి వల్ల పంజాబ్ సరిహద్దులోని ప్రాంతాల్లో తీవ్ర విధ్వంసం జరిగింది. ఈ ప్రబల వరదల కారణంగా ఇండో-పాక్ సరిహద్దులో దాదాపు 30 కిలోమీటర్ల ఇనుప కంచె బీభత్సంగా కొట్టుకుపోయింది. ఫలితంగా భద్రతా సిబ్బందికి అనేక పోస్టులను తాత్కాలికంగా ఖాళీ చేయవలసి వచ్చింది. గురుదాస్పూర్, అమృత్సర్, పఠాన్కోట్ జిల్లాల్లో 50కి పైగా బీఎస్ఎఫ్ చెక్పోస్టులు నష్టపోయాయి. ఇనుప సరిహద్దు కంచె దాదాపు 30 కిలోమీటర్ల మేర కొట్టుకుపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వరదలలో మునిగిపోయిన 30 నుంచి 40 అవుట్పోస్టులు
ఓ వైపు నష్టం జరిగినప్పటికీ , బీఎస్ఎఫ్ సిబ్బంది తమ గస్తీని కొనసాగించడానికి అడ్డంకులు ఎదుర్కొంటూ, పడవల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ సమయంలో సైన్యం మాదకద్రవ్యాల స్మగ్లర్లు భారత్లోకి ప్రవేశించే ప్రయత్నాలను గుర్తించింది. అందువల్ల భద్రతా చర్యలను మరింత కఠినతరం చేశారు. స్మగ్లర్ల ప్రయత్నాలను సిబ్బంది విజయవంతంగా ఆపుతున్నారు.
గురుదాస్పూర్ ప్రాంతంలో దాదాపు 30 నుంచి 40 అవుట్పోస్టులు వరదలలో మునిగిపోయాయి.
స్థానికులు సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లారు. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
గురుదాస్పూర్, అమృత్సర్, ఫిరోజ్పూర్ సెక్టార్లలో దాదాపు 30 కిలోమీటర్ల ఫెన్సింగ్ నాశనం అయ్యిందని బీఎస్ఎఫ్ పంజాబ్ ఫ్రాంటియర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఎకె విద్యార్థి తెలిపారు.
కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ సమీపంలో మునిగిన బీఎస్ఎఫ్ పోస్ట్
అమృత్సర్లోని షాజాదా గ్రామంలో నీటి మట్టం పెరగడంతో సైనికులు కమల్పూర్లోని బీఎస్ఎఫ్ పోస్ట్ను ఖాళీ చేశారు. కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ సమీపంలోని ప్రసిద్ధ బీఎస్ఎఫ్ పోస్ట్ కూడా వరదల వల్ల మునిగిపోయింది. సిబ్బంది తాత్కాలికంగా డేరా బాబా నానక్లోని గురుద్వారా దర్బార్ సాహిబ్కి తరలివెళ్లారు. రావి నది జీరో లైన్కు రెండు వైపులా వరదలు రావడం వల్ల పాకిస్థాన్ రేంజర్లు కూడా తమ ఫార్వర్డ్ పోస్టులను వదిలివేయవలసి వచ్చింది. అధికారుల వివరాల ప్రకారం, రాబోయే మూడు రోజుల్లో వర్షాలు లేకుండా నీటి మట్టాలు తగ్గిపోవడం సహజమని, రెండు-మూడు రోజులలో పరిస్థితులు స్తిరమవుతాయని భావిస్తున్నారు.


