. మెప్మా ద్వారా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలి : అబ్దుల్ ఖాదర్
విశాలాంధ్ర – విజయవాడ (వన్టౌన్) : మున్సిపల్ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, వ్యాపార రుణ మద్దతు అందించాలని మాజీ కార్పొరేటర్, రాష్ట్ర తెలుగు దేశం పార్టీ (మైనారిటీ సెల్) ఆర్గనైజింగ్ సెక్రటరీ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన పేదరిక నిర్మూలన మిషన్ (మెప్మా) మిషన్ డైరెక్టర్ ఎన్. తేజ్ భరత్కు బుధవారం విజ్ఞప్తి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఖాదర్ మాట్లాడుతూ, మున్సిపల్ ప్రాంతాల్లో అనేకమంది నిరుద్యోగ యువత స్వయం ఉపాధి ప్రారంభించాలనే ఆసక్తి కలిగి ఉన్నప్పటికీ, సరైన శిక్షణ, ఆర్థిక సహాయం అందకపోవడం వల్ల అవకాశాలను కోల్పోతున్నారని తెలిపారు. అందువల్ల, మెప్మా ఆధ్వర్యంలో టైలరింగ్, ఎలక్ట్రికల్ పనులు, కంప్యూటర్ అక్షరాస్యత, డిజిటల్ మార్కెటింగ్, హస్తకళలు వంటి రంగాలలో ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అదనంగా, స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు వ్యవస్థాపక అభివృద్ధి మార్గదర్శకత్వం కూడా అవసరమని అన్నారు. అలాగే ప్రభుత్వ పథకాల కింద బ్యాంకులు లేదా మైక్రోఫైనాన్స్ సంస్థల ద్వారా వ్యాపార రుణాలు సులభతరం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ చర్యలతో శిక్షణ పొందిన యువత స్వయం ఉపాధిని ప్రారంభించి స్థిరమైన జీవనోపాధి పొందగలరని పేర్కొన్నారు. పేదరిక నిర్మూలనలో భాగంగా యువతకు ప్రాక్టికల్ నైపుణ్యాలు అందించడం, చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడం ద్వారా పట్టణాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, మెప్మా ఆ దిశగా ముందడుగు వేయాలని కోరారు.


