. పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ అనుకూలం
. ప్రగతిశీల విధానాలు… ప్రపంచస్థాయి సదుపాయాలు
. ఆస్ట్రేలియాలో దిగ్గజ సంస్థ ‘ఒరికా’ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్బాబు భేటి
విశాలాంధ్ర – హైదరాబాద్: దేశంలోనే పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని మంత్రి శ్రీధర్బాబు కోరారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బుధవారం మెల్బోర్న్లో పారిశ్రామిక పేలుడు పదార్థాల తయారీ, మైనింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర రంగాల్లో అంత ర్జాతీయ అగ్రగామిగా ఉన్న ‘ఒరికా’ సంస్థ సీఈఓ, ఎండీ సంజీవ్ గాంధీ, ఇతర ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. తెలంగాణలో ‘ఒరికా’ ప్రస్తుత కార్యకలా పాలు, భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపై సుదీర్ఘంగా చర్చించారు. ‘ఇన్నోవేషన్, టెక్నాలజీ హబ్లను ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణ వైపు చూస్తున్నాయి. జీసీసీలు, పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రం అత్యంత అనుకూలం. పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించే ప్రగతిశీల విధానాలు, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, ఎకో సిస్టమ్, స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వం అందుబాటులో ఉంది’ అని ఈ సందర్భంగా మంత్రి కంపెనీ ప్రతినిధులకు వివరించారు. ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్, సస్టెయినబిలిటీ, మాన్యుఫాక్చరింగ్, మైనింగ్ రంగాల్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం తెలంగాణతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు. పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందన్నారు. ‘ప్రస్తుతం హైదరాబాద్లో నిర్వహిస్తున్న జీసీసీలో డిజిటల్ ఇంజినీరింగ్, ఆటోమేషన్, అడ్వాన్స్డ్ అనలిటిక్స్ తదితర రంగాల్లో 600 మంది నిపుణులకు ఉద్యోగాలు కల్పించాం. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. తెలంగాణలో కార్యకలాపాల విస్తరణ, వివిధ రంగాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ఒరికా సంస్థ సీఈఓ, ఎండీ సంజీవ్ గాంధీ తెలిపారు. ‘ఆస్ బయోటెక్ 2025 ఇంటర్నేషన్ కాన్ఫరెన్స్’లో కీలకోపన్యాసం చేసేందుకు ఆస్ట్రేలియాకు విచ్చేసిన మంత్రి శ్రీధర్ బాబును కంపెనీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.
ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటుకు వీఐటీ ఆసక్తి
తెలంగాణలో ‘ప్లగ్ అండ్ ప్లే’ విధానంలో ‘ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిటీ’ని ఏర్పాటు చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ విద్యా సంస్థ విక్టోరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వీఐటీ) ఆసక్తి చూపిస్తోంది. ఈ మేరకు మంత్రి శ్రీధర్ బాబును మెల్బోర్న్ లో వీఐటీ బోర్డు సభ్యుడు, మాజీ పార్లమెంటే రియన్, ప్రస్తుత ఆస్ట్రేలియా ప్రధాని సన్నిహితుడు అలన్ గ్రిఫిన్ ప్రత్యేకంగా కలిశారు. ఉన్నతస్థాయి పరిశోధన కేంద్రాలు, నైపుణ్యాభివృద్ధి సంస్థలకు ‘గ్లోబల్ హబ్’ గా ఈ క్యాంపస్ ను అభివృద్ధి చేస్తామని ‘విట్’ ప్రతినిధులు మంత్రికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వీఐటీ ప్రతినిధి అర్జున్ సూరపనేని ఉన్నారు.
‘గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్’ …
అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను ‘గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్’ గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని మంత్రిశ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ప్రముఖ యూనివర్సిటీ ‘ఆర్ఎంఐటీ’తో రాష్ట్ర ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్(ఎల్ వోఐ)ను కుదుర్చుకుందని చెప్పారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ఇన్నోవేషన్, పరిశోధన, అభివృద్ధి, ఉన్నత విద్య, పరిశ్రమల అవసరాలకు అనుగు ణంగా రెడీ టూ వర్క్ ఫోర్స్ తయారీ తదితర అంశాల్లో ద్వైపాక్షిక సహకారానికి ఈ ఒప్పందం దోహదపడుతుంద న్నారు. రేపటి జీనోమ్ వ్యాలీకి ఇది ఒక బ్లూ ప్రింట్గా మార్గ నిర్దేశం చేస్తుందన్నారు. ‘‘లైఫ్ సైన్సెస్’’ ఆర్థిక వ్యవస్థను 2030 నాటికి 250 బిలియన్ డాలర్లకు చేర్చా లని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 80 బిలియన్ డాలర్ల విలువ చేసే 2వేలకు పైగా జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ ఫార్మా, బయోటెక్ కంపెనీలు ఇక్కడ ప్రస్తుతం కార్యకలా పాలు నిర్వహిస్తున్నాయన్నారు. దేశంలో ఉత్పత్తయ్యే ఔషధాల్లో మన వాటా 40 శాతంగా ఉందన్నారు. త్వరలోనే లైఫ్ సైన్సెస్ స్కూల్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఉమ్మడి అకడమిక్ కరిక్యులంను రూపొందించి విద్యార్థులను రేపటి అవసరాలకు అనుగుణంగా స్కిల్డ్ వర్క్ ఫోర్స్ గా తయారు చేస్తామన్నారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈఓ శక్తి నాగప్పన్, ఆర్ఎంఐటీ యూనివర్సిటీ డిప్యూటీ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ కేథరీన్ ఇట్సియోపౌలోస్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకాలు చేశారు. తెలంగాణతో కలిసి పనిచేసే అవకాశం దక్కడం సంతోషంగా ఉందని ప్రొఫెసర్ కేథరీన్ ఇట్సియోపౌలోస్ అన్నారు.


