హిమాచల్ సీఎం జైరామ్ ఠాకూర్ డిమాండు
సిమ్లా : పంజాబీ గాయకుడు సిద్ధూ మూపేవాలా హత్యపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని హిమాచల్ ప్రదేశ్ సీఎం జై రామ్ ఠాకూర్ పంజాబ్ ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…సీఎం భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వం ప్రజల్లో గొప్ప అనిపించుకోవడం కోసం మూసేవాలాకు ఉన్న భద్రతను తొలగించడంతోనే ఈ దారుణం చోటుచేసుకుందని ఆరోపించారు. ఆప్ ప్రభుత్వం అధికారం చేపట్టిననాటి నుంచి పంజాబ్లో శాంతి భద్రతలు క్షీణించాయని పేర్కొన్నారు. తమ రాష్ట్రంలోని ధర్మశాలలో ఉన్న అసెంబ్లీ గోడకు పంజాబ్కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఖలిస్థాన్ జండా కట్టి నినాదాలు చేశారని, వారిని ఐదు రోజుల్లోనే అరెస్టు చేసినట్టు తెలిపారు. పంజాబ్లో ఇటువంటి పరిస్థితి లేదని విమర్శించారు. ఖలిస్థాన్ జండాలతో తిరిగినా, నినాదాలు చేసినా ఆ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాజకీయంగా మైలేజీ పొందడం కోసం 200 మందికి ఉన్న భద్రతను తొలగించారని పేర్కొన్నారు. అవినీతికి పాల్పడిన ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ సంఫ్లీుని తొలగించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన గత చరిత్ర తెలియకుండా పదవి ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం భద్రతను తొలగించడంతోనే మూసేవాలా హత్య జరిగిందని, ఆ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ఆప్ ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నట్టు పేర్కొన్నారు.