ప్రధాని, కేంద్రమంత్రులకు కేటీఆర్ సూటి ప్రశ్న
ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్రమంత్రులు హైదరాబాద్కు ఎందుకు వస్తున్నారని రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్ నగర పరిధిలోని కైతలాపూర్ ఫ్లై ఓవర్ను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ‘రాబోయే వారం రోజుల్లో దేశంలో ఉండే పెద్ద పెద్ద నాయకులు.. ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్రమంత్రులు వస్తున్నరట.. వారందరినీ కూకట్పల్లి వేదికగా అడుగుతున్న.. ప్రధానమంత్రి గారు గుజరాత్ రూ.20వేలకోట్లతో ప్రాజెక్టులకు శంకుస్థాపన అంటరు. ఇంకోకాడికి ఆడో వేలకోట్లతో కార్యక్రమని ప్రకటన చేస్తరు.. మరి అది నిజమో, అబద్ధమో తెల్వదు. మీరు ఇప్పటి వరకు చెప్పిన చాలా మాటలు జుమ్లాలు, ఉత్త డొల్ల మాటలు తప్ప మాటలు తప్ప అందులో విషయం ఉండదు’ అంటూ విమర్శించారు.