
మేయర్గా గణేశ్, డిప్యూటీ మేయర్గా కాంగ్రెస్ అభ్యర్థి లలిత కుమారి
. చెరో రెండున్నరేళ్లు మేయర్ పదవికి ఒప్పందం
. బీఆరఎస్ కార్పొరేటర్ల గైర్హాజరు
. ఉత్కంఠతకు తెర
విశాలాంధ్ర బ్యూరో – కొత్తగూడెం: కొద్ది రోజులుగా కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠంపై నెలకొన్న ఉత్కంఠతకు ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, సీపీఐ మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను చెరో రెండున్నరేళ్ల చొప్ప్పున పంచుకోవాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. అసెంబ్లీ ఎన్నికల నుంచి మిత్రపక్షంగా కొనసాగుతున్న సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు సమైక్యంగా తమ మిత్రబంధాన్ని కొనసాగించేందుకు ముందుకు వచ్చాయి. తొలి మేయర్ అభ్యర్థి ఎవరికి దక్కాలన్న విషయంలో సస్పెన్స్కు తెరదించుతూ తొలి పాలకవర్గం సోమవారం కొలువుతీరింది. ఒప్పందం ప్రకారం సీపీఐకి చెందిన 20వ డివిజన్ కార్పొరేటర్ మూడ్ గణేశ్… మేయర్ గా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ సిరిపురపు లలిత కుమారి డిప్యూటీ మేయర్గా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత నగరపాలకసంస్థ భవనంలో కార్పొరేటర్లతో జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాలరావు ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ల ఎంపిక జరిగింది. సీపీఐ కార్పొరేటర్ అడుసుమిల్లి సాయిబాబా… మేయర్గా గణేశ్ను ప్రతిపాదించగా… స్వతంత్ర కార్పొరేటర్ కంభంపాటి దుర్గాప్రసాద్ బలపరిచారు. డిప్యూటీ మేయర్ గా సిరిపురపు లలిత కుమారిని కాంగ్రెస్ కార్పొరేటర్ కనుకుంట్ల శ్రీనివాస్ ప్రతిపాదించగా … బోయిన విజయ్ కుమార్ బలపరిచారు. కాగా, మున్సిపల్ ఎన్నికల లో మిత్రపక్షాలైన కాంగ్రెస్ -సీపీఐ చివరి నిమిషం వరకు కలిసి పోటీ చేసేందుకు విశ్వప్రయత్నాలు కొనసాగాయి. కలిసి పోటీ చేయడం ద్వారానే మంచి ఫలితాలు ఉంటాయని సీపీఐ నేతలు మెట్టు దిగివచ్చినా కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం ససేమిరా అంటూ దూరం పెంచారు. దీంతో కాంగ్రెస్, సీపీఐ వేర్వేరుగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అభ్యర్థుల నామినేషన్ల దగ్గర నుంచి ఎన్నికల ఫలితాలు … పదవులు చేపట్టేంత వరకు రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా కొత్తగూడెం కార్పొరేషన్పై తీవ్ర ఉత్కంఠ వాతావరణం కనిపించింది. ప్రధానంగా 60 డివిజన్లలో జరిగిన పోరులో సీపీఐ 22 సీట్లు సాధించగా, కాంగ్రెస్ 22 స్థానాలు దక్కించుకుంది. దీంతో మేయర్ పీఠం ఎవరిని వరిస్తుందో అనే ఆతత రెండు పార్టీల్లో నెలకొంది. ఇదిలా ఉండగా ఎనిమిది డివిజన్ల లో విజయం సాధించిన బీఆరఎస్ బేషరతుగా సీపీఐకి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అయినప్పటికీ పదవుల కంటే రాజకీయ సుదీర్ఘ లక్ష్యాలు, స్థానిక ప్రజల భవిష్యత్తు ముఖ్యమని భావించి సీపీఐ నేతలు విశాల దృక్పథంతో బంధానికే ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో ఐదేళ్లలో చెరో రెండున్నరేళ్ల పాటు మేయర్ పదవి చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఒప్పందంలో భాగంగా తొలి రెండున్నరేళ్లు సీపీఐకి ఇచ్చేలా అంగీకారం కుదిరింది. మరో రెండున్నర ఏళ్లు కాంగ్రెస్ కు అవకాశం దక్కింది. దీంతో మిత్రభేదం కథ సుఖాంతమైంది. కొత్తగూడెం తొలి పాలక మండలి కొలువుతీరింది. కాగా, ఎనిమిది మంది బీఆరఎస్ కార్పొరేటర్లు సమావేశానికి గైర్హాజరయ్యారు. వీరు మరోరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
సమిష్టిగానే ముందుకు…
ఇరు పార్టీల అగ్రనాయకత్వం ఒప్పందం ప్రకారం సమిష్టిగా కలిసి ముందుకు సాగేందుకు నిర్ణయించుకున్నారు. ప్రమాణస్వీకారానికి ముందు ఓ హోటల్లో కాంగ్రెస్ ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు పల్లా వెంకటరెడ్డి, భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషాలు కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జరిగిన ఒప్పందాన్ని వారికి వివరించి అధినాయకత్వం మాటే శిరోధార్యమని చెప్పి మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లను ప్రకటించారు. అనంతరం ర్యాలీగా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కార్యాలయ ఆవరణ సందడిగా మారింది. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, బంధుమిత్రులు, అభిమానులు, సన్నిహితులతో జనసంద్రమైంది.


