సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద ఉద్రికత్త చోటు చేసుకుంది. ఈ నెల 25న భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ దరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. కాగా ఈ మ్యాచ్ టిక్కెట్ల కోసం అభిమానులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మ్యాచ్ టిక్కెట్ల కోసం వేలాది సంఖ్యలో యువకులు సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ దగ్గరకు వచ్చారు. గేట్లకు తాళం వేయడంతో పాటు టిక్కెట్లు విక్రయించడం లేదని అక్కడి అధికారులు చెప్పడంతో వాళ్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అప్పటికే గంటల కొద్దీ నిరీక్షించిన యువకులు గేట్లు తోసుకొని, గోడలు దూకి జింఖానా క్రికెట్ మైదానంలోకి వచ్చారు. అక్కడి హెచ్సీఏ కార్యాలయాన్ని చుట్టు ముట్టారు. నాలుగైదు రోజులుగా తిరుగుతున్నా టిక్కెట్లు అమ్మడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘పేటీఎం’ యాప్లో టిక్కెట్లు అందుబాటులో లేవని, ఉన్నా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.