ధర్మశాల: ఐపీఎల్ 2026 సీజన్లో ధర్మశాలలో ఆదివారం జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) పంజాబ్ జట్టుపై 23 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్కు అర్హత సాధించింది. అద్భుత ప్రదర్శనలతో ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ మరో ఓటమి చవిచూసింది. 223 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్… పూర్తిగా తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులకే పరిమితమైంది. దీంతో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శశాంక్ సింగ్(56) హాఫ్ సెంచరీ చేసినా పంజాబ్కు ఓటమి తప్పలేదు.
కూపర్ కనోలీ(37), సూర్యాంశ్(35), స్టోయినిస్(37), అజ్మతుల్లా(14) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ప్రియాంశ్ ఆర్య(0), ప్రభ్సిమ్రన్ సింగ్(2), శ్రేయస్ అయ్యర్(1) తీవ్రంగా విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో…రసిక్ సలామ్ దార్ 3, భువనేశ్వర్ కుమార్ 2, హేజిల్వుడ్, సుయాశ్ శర్మ, షెఫర్డ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో ఆర్సీబీ 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, పంజాబ్ కింగ్స్కు ఇది వరుసగా ఆరో ఓటమి కావడం గమనార్హం.
ఆర్సీబీ బ్యాటింగ్ సాగిందిలా…
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(58; 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు), వెంకటేశ్ అయ్యర్(73; 40 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. బెథెల్(11) మరోసారి విఫలమయ్యాడు. దేవదత్ పడిక్కల్(45; 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు), టిమ్ డేవిడ్(28; 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు) క్రీజులో ఉన్నంత సేపు దూకుడుగా ఆడారు. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ 2, అర్ష్దీప్ సింగ్, చాహల్ తలొక వికెట్ పడగొట్టారు.
ఐపీఎల్లో నేటి మ్యాచ్…
ఐపీఎల్ 63వ మ్యాచ్ సోమవారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లు సమాన బలాలతో ఉండటంతో హోరాహోరీ పోరు జరుగబోతోంది. ఎసఆర్హెచ్ 12 మ్యాచ్లు ఆడి 7 విజయాలు సాధించి, 5 మ్యాచ్ల్లో ఓటమి చెంది 14 పాయింట్లతో ఉంది. సీఎస్కే 12 మ్యాచ్లు ఆడి 6 మ్యాచ్లలో విజయం సాధించి, 6 మ్యాచ్లు ఓటమి చెంది 12 పాయింట్లు సాధించింది.
ప్లే ఆఫ్స్కు ఆర్సీబీ
- Advertisement -
RELATED ARTICLES


