ప్రదాని మోదీతో బేటీ అనంతరం సీఈఓ జెస్సీ వెల్లడి
న్యూదిల్లీ: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్లో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. సీఈఓ ఆండీ జెస్సీ గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో దిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం జెస్సీ మాట్లాడుతూ ఏఐ, క్లౌడ్ సేవలు భారత్లో భారీగా విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం రానున్న 5 ఏళ్లలో అదనంగా 13 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు. ఆరు నెలల క్రితం దేశంలో 35 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతామని అమెజాన్ వెల్లడించగా…తాజా ప్రకటనతో తమ మొత్తం పెట్టుబడి ప్రణాళికలు 48 బిలియన్ డాలర్లకు చేరాయని జెస్సీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా మోదీతో కలిసిన ఫొటోలను పంచుకున్నారు. ‘భారత్లో దీర్ఘకాలిక వాణిజ్యానికి అమెజాన్ కట్టుబడి ఉంది. 2030 నాటికి ఏఐ, క్లౌడ్ సేవలను భారీగా విస్తరించనుంది. ఇందుకోసం 48 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నాం. 2030 నాటికి 3.8 మిలియన్ ఉద్యోగాలను కల్పిస్తాం. 80 బిలియన్ డాలర్ల ఇ-కామర్స్ ఎగుమతులను సృష్టిస్తాం. 15 మిలియన్ చిన్న వ్యాపారులకు, 4 మిలియన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ ప్రయోజనాలను అందిస్తాం’ అని ఆండీ జెస్సీ ఎక్స్ వేదికగా తెలిపారు.
హైదరాబాద్, ముంబైలో డేటా సెంటర్లు…
‘హైదరాబాద్, ముంబైలోని ఏడబ్ల్యూఎస్ (అమెజాన్ వెబ్ సర్వీసెస్) డేటా సెంటర్ల విస్తరణకు ఈ పెట్టుబడులు ఉపయోగించనున్నాం. దీని వల్ల భారత్లోని స్టార్టప్లు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఏఐ, క్లౌడ్ సేవలను అందిస్తాం’ అని అమెజాన్ పేర్కొంది. అమెజాన్ భారీ పెట్టుబడులను మోదీ స్వాగతించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ఆండీ జెస్సీతో గొప్ప భేటీ జరిగింది. భారత్లో అమెజాన్ 48 బిలియన్ డాలర్ల పెట్టుబడులను స్వాగతిస్తున్నాం. దీంతో యువతకు కొత్త అవకాశాలు ఏర్పడుతాయి. భారత్లో పెట్టుబడులకు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనం’ అని పేర్కొన్నారు.
భారత్లో అమెజాన్ భారీ పెట్టుబడులు
- Advertisement -


