Homeజాతీయంరాజా రఘువంశీ హనీమూన్ హత్య కేసు : సోనమ్ బెయిల్‌పై స్టేకు సుప్రీం నిరాకరణ..

రాజా రఘువంశీ హనీమూన్ హత్య కేసు : సోనమ్ బెయిల్‌పై స్టేకు సుప్రీం నిరాకరణ..

- Advertisement -

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజా రఘువంశీ హనీమూన్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సోనమ్ రఘువంశీకి మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ మేఘాలయ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. సోనమ్ బెయిల్‌పై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం, ఆమెకు నోటీసులు జారీ చేసింది. నిందితురాలు ఇప్పటికే విడుదలైనందున, బెయిల్ ఉత్తర్వుల అమలును నిలిపివేయలేమని స్పష్టం చేసింది.జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ షీల్ నాగులతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై మాకు ప్రాథమికంగా కొన్ని సందేహాలున్నాయి. విచారణ ఎలా సాగుతుందో చూస్తాం. అరెస్టుకు గల కారణాలను ఆమెకు తెలియజేశారు. గతంలో బెయిల్ పిటిషన్లలో ఆమె ఈ అంశాన్ని లేవనెత్తలేదుఁ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సోనమ్ రఘువంశీ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.మేఘాలయ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ (ఎస్‌జీ) తుషార్ మెహతా వాదనలు వినిపించారు. అరెస్టు పత్రాల్లోని పొరపాటు కేవలం టైపింగ్ తప్పిదం మాత్రమేనని, అరెస్టుకు గల కారణాలను నిందితురాలికి స్పష్టంగా తెలియజేశారని కోర్టుకు వివరించారు. కింది కోర్టులు ఈ కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని, ఈ తీర్పు ఒక తప్పుడు సంప్రదాయానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసు విచారణ ప్రారంభమైందని, ఇంకా 90 మందికి పైగా ప్రాసిక్యూషన్ సాక్షులను విచారించాల్సి ఉందని తెలిపారు.

కేసు నేపథ్యం ఇదే..!
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ, సోనమ్‌కు 2025 మేలో వివాహమైంది. హనీమూన్ కోసం వారు మేఘాలయకు వెళ్లారు. అక్కడ వీసాడాంగ్ జలపాతం సమీపంలోని లోయలో రాజా మృతదేహం లభ్యమైంది. సోనమ్ తన ప్రియుడితో కలిసి కుట్ర పన్ని, కిరాయి హంతకులతో తన భర్తను హనీమూన్‌లోనే హత్య చేయించిందని ప్రాసిక్యూషన్ ఆరోపిస్తోంది.

అయితే, అరెస్టు సమయంలో పోలీసులు తీవ్రమైన విధానపరమైన లోపాలకు పాల్పడ్డారని షిల్లాంగ్ కోర్టు గుర్తించింది. హత్యకు సంబంధించిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్‌) సెక్షన్ 103(1) బదులుగా అన్ని అరెస్టు పత్రాల్లో సెక్షన్ 403(1)ని తప్పుగా పేర్కొన్నారని, దీనివల్ల నిందితురాలికి తనపై ఉన్న ఆరోపణ ఏమిటో సరిగ్గా తెలియలేదని అభిప్రాయపడింది. ఈ కారణంతోనే ఏప్రిల్ 2026లో కింది కోర్టు బెయిల్ మంజూరు చేయగా, జూన్ 29న మేఘాలయ హైకోర్టు ఆ ఉత్తర్వులను సమర్థించింది. ఇప్పుడు ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు