హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్యనగర్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.నాలా పక్కనే 50 గజాల స్థలంలో ఇటీవల నిర్మాణం పూర్తయిన ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. భవన శిథిలాల కింద చిక్కుకున్న వారి మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. శిథిలాలను పూర్తిగా తొలగించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
పక్కనున్న అపార్ట్మెంట్కు నష్టం
నిర్మాణం పూర్తయి అద్దెలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో ఈ భవనం అకస్మాత్తుగా కూలిపోయింది.దీంతో శిథిలాలు పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై పడటంతో దాని గోడలు ధ్వంసమయ్యాయి. సమీపంలోని హాస్టల్లో ఉన్న విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు.సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనం కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు పరిశీలిస్తున్నారు.సాయంత్రం వేళ ఈ ప్రమాదం జరిగి ఉంటే మరింత భారీగా ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


