ఇరాన్లో సెపెహ్రాన్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737 విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మషద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలోని ఓ టైరు ఊడిపోయింది. ఇంజిన్లోనూ సమస్య తలెత్తడంతో అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని తిరిగి మషద్కు మళ్లించారు.
మషద్ నుంచి కెర్మాన్షాకు..
సెపెహ్రాన్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737 విమానం ఇరాన్లోని మషద్ విమానాశ్రయం నుంచి కెర్మాన్షాకు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ టైరు ఊడిపోయినట్లు పైలట్లు గుర్తించారు. ఇదే సమయంలో ఇంజిన్లోనూ సాంకేతిక సమస్య తలెత్తింది. ఒకే ఇంజిన్తో ప్రయాణం కొనసాగించడం ప్రమాదకరమని భావించిన పైలట్లు విమానాన్ని వెనక్కి మళ్లించాలని నిర్ణయించారు.
ల్యాండింగ్ సమయంలో తీవ్ర కుదుపులు..
విమానం తిరిగి మషద్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ల్యాండింగ్ చేస్తుండగా రన్వేపై తీవ్ర కుదుపులకు గురైంది. ఈ కుదుపుల కారణంగా విమానంలోని లగేజీ క్యాబిన్లు తెరుచుకున్నాయి. అందులోని బ్యాగులు ప్రయాణికులపై పడటంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
స్వల్ప గాయాలు.. దర్యాప్తు ప్రారంభం
పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. లగేజీలు పడటంతో కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు సెపెహ్రాన్ ఎయిర్లైన్స్ వెల్లడించింది. వారికి ప్రాథమిక చికిత్స అందించినట్లు తెలిపింది.ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యలకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.


