Friday, May 9, 2025
Home Blog

ప్రతి ఎకరాకు నీరిస్తాం

0

పేదరికం లేని సమాజమే లక్ష్యం
జూలై 10 కల్లా హంద్రీనీవా నీరు విడుదల
అనంతపురం పర్యటనలో సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర`ఉరవకొండ: రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందాలని, పేదరికం లేని సమాజం నిర్మించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. హంద్రీనీవా సుజల సవ్రంతి ద్వారా జులై 10 కల్లా నీరు విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మొత్తం 4,04,500 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. 2029 నాటికి పేదరికం లేని సమాజమే లక్ష్యమన్నారు. ఆర్థిక అసమానతలను తగ్గిస్తామని తెలిపారు. సాంకేతిక సద్వినియోగంతోనే ముందుకెళ్లగలమని చంద్రబాబు నొక్కిచెప్పారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం చాయాపురంలో ముఖ్యమంత్రి శుక్రవారం పర్యటించారు. హంద్రీనీవా సుజల స్రవంతి పనులను పరిశీలించారు. హంద్రీనీవా పనులపై ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. క్షేత్రస్థాయి పనులను డ్రోన్‌ ద్వారా పరిశీలించారు. ప్రోగ్రామింగ్‌ ద్వారా రోజూ ఎంతమేర పనులు చేశారో డ్రోన్‌ ద్వారా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. నాలుగు ఏజన్సీల ద్వారా పనులు జరుగుతున్నాయని సీఎంకు అధికారులు వివరించారు. ఇటీవల వర్షాలతో ఆటంకం కలిగిందని వారు చెప్పగా ఇక పనులు వేగవంతం కావాలని, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అనంతరం చాయాపురం ప్రజావేదికలో పాల్గొన్నారు. భారత్‌-పాక్‌ పోరులో అమరుడైన శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన జవాన్‌ మురళీ నాయక్‌కు సీఎం నివాళులర్పించారు. ఫోన్‌ చేసి నాయక్‌ కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. పాకిస్థాన్‌ కవ్వింపులకు పాల్పడటం మంచిది కాదని, దేశ పోరాటానికి ప్రతి ఒక్కరూ సంఫీుభావం తెలపాలని చంద్రబాబు అన్నారు. ‘భారత్‌ మాతాకు జై’ అని నినదాలిచ్చారు. పేదరికం వల్ల ఎవరికీ చదువుకోలేని పరిస్థితి రాకూడదన్నారు. అండదండలు లేక ఎంతో మంది కూలీలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘పేదవాళ్లను పైకి తెచ్చేందుకు… కిందిస్థాయిలో ఉన్న 20 శాతం మందికి అండగా నిలుద్దాం. సూచనలు, సలహాలే కాదు… అవసరమైతే డబ్బు ఖర్చు చేద్దాం’ అని పిలుపునిచ్చారు. ఆర్థిక అసమానతలు తగ్గించడమే మా ప్రభుత్వ లక్ష్యమని సీఎం అన్నారు. కష్టపడి చదువుకుని పైకి వచ్చినవారు ఎంతో మంది ఉన్నారని, సరైన సమయంలో సరైన మార్గదర్శకత్వం లభిస్తే జీవితంలో పైకి రాగలమన్నారు. వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చేశామన్నారు. ఉరవకొండకు టెక్స్‌టైల్‌ పార్క్‌, పొట్టిపాడు దగ్గర బ్రిడ్జ్‌ నిర్మాణానికి నిధులు, కొట్టాలపల్లి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ మంజూరు చేస్తున్నామన్నారు. జీడిపల్లి నిర్వాసితులకు వెంటనే పరిహారమిస్తామన్నారు. 40 వేల ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు పునరుద్ధరిస్తామని చెప్పారు. రామసాగరం బ్రిడ్స్‌, జీడిపల్లి, భైరవారి తిప్ప, పేరూరు సహా అన్నింటికి ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేస్తామని వెల్లడిరచారు. చాయాపురం గ్రామాభివృద్ధికి సహాయం అందిస్తామన్నారు. ఆగస్టు 15 నాటికి 20 లక్షల కుటుంబాల బాధ్యత తీసుకునే మార్గదర్శులను సిద్ధంచేస్తామని సీఎం చెప్పారు. బంగారు కుటంబంగా ఎంపికైన చాయాపురం గ్రామస్థురాలు పార్వతి కుటుంబానికి అండగా నిలుస్తామని చంద్రబాబు తెలిపారు. ‘ఇల్లు కట్టిస్తాం. ఆమె నలుగురు పిల్లలకు ఒకొక్కరికి రూ.లక్ష డిపాజిట్‌ చేస్తాం. తల్లికి వందనం కింద రూ. 15 వేలు ఇస్తాం’ అని చెప్పారు. పార్వతికి, ఆమె భర్తకు ఉపాధి కల్పించే బాధ్యతను మార్గదర్శులు తీసుకోవాలన్నారు. మార్గదర్శి అనంతయ్య ముందుకొచ్చి పార్వతి కుటుంబానికి అన్ని విధాలా సాయం చేస్తానని, మా కంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌గా పార్వతి భర్తకు ఉద్యోగం ఇస్తానని చెప్పారు. ఆమె పిల్లల చదువుకయ్యే ఖర్చు మొత్తం భరిస్తానన్నారు. 20ఏళ్లుగా సేవ చేస్తున్నానని, వందల కుటుంబాలను బంగారు కుటుంబాలుగా తయారు చేశానని అనంతయ్య చెప్పుకున్నారు.

లిక్కర్‌ స్కాంపై సిట్‌ దూకుడు

0

. హైదరాబాద్‌లో నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు
. 11న విచారణకు రావాలని నోటీసులు అందజేత

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో సిట్‌ దూకుడు పెంచింది. నిందితులైన కృష్ణమోహన్‌ రెడ్డి, ధనుంజయరెడ్డి, బాలాజీ గోవిందప్పలు హైదరాబాద్‌లో ఉంటుండగా, శుక్రవారం అధికారులు వారి నివాసాలు, కార్యాలయాలకు వెళ్లి సోదాలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాజీ కార్యదర్శి ధనుంజయ్‌ రెడ్డి, మాజీ పీఏ కృష్ణమోహన్‌ రెడ్డి, ఆయన కుమారుడు రోహిత్‌ రెడ్డి, భారతి సిమెంట్స్‌ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్ప ఇళ్లు, కార్యాలయాలపై సిట్‌ అధికారులు సోదాలు జరిపారు. వారెవరూ ఇళ్లలో లేకపోవడంతో ఈనెల 11వ తేదీన ఉదయం 10 గంటలకు విచారణ కోసం విజయవాడ సిట్‌ కార్యాలయానికి రావాలని వారి కుటుంబసభ్యులకు నోటీసులు అందజేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో దాదాపు రూ.3,200 కోట్లకు పైగా ముడుపుల రూపంలో చేతులు మారాయన్న ఆరోపణలపై సిట్‌ ప్రాథమిక ఆధారాలు సేకరించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన కీలక నిందితులు రాజ్‌ కెసిరెడ్డి, సజ్జల శ్రీధర్‌ రెడ్డితో పాటు మరికొందరి స్టేట్‌మెంట్ల ఆధారంగానూ సిట్‌ సమాచారం సేకరించింది. పాలసీ రూపకల్పన, ఏ స్థాయిలో ఏ అధికారిని నియమించాలనే విషయంలో ధనుంజయరెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్‌ చెబుతోంది. మద్యం పాలసీ రూపకల్పన, సరఫరాదారుల నుంచి ముడుపుల వసూళ్లు, ఆ సొమ్మును డొల్ల కంపెనీలకు మళ్లించడంలో వీరి పాత్ర ఉందని భావిస్తోంది. క్రయ, విక్రయాల్లో పర్సంటేజ్‌ల గురించి చర్చించేందుకు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి మద్యం కంపెనీ యజమానులతో హైదరాబాద్‌, తాడేపల్లిలో పలుమార్లు సమావేశం అయ్యారని, వసూలు చేసిన సొమ్మును షెల్‌ కంపెనీల ద్వారా మళ్లించారని సిట్‌ ఆధారాలు సేకరించింది. ఆ సొమ్ము అంతిమంగా ఎవరి ఖాతాకు చేరిందనే విషయం దర్యాప్తులో తేలాల్సి ఉంది. దీనిపై వారిని విచారించేందుకు తాజాగా నోటీసులు జారీ చేసింది.

డ్రోన్ల కూల్చివేత

0

మరోసారి పాక్‌ దాడి
. తిప్పికొట్టిన భారత బలగాలు బ సాంబా సెక్టార్‌లో కాల్పులు, పేలుళ్లు
. కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తత

న్యూదిల్లీ : భారత్‌- పాక్‌ నడుమ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌ సరిహద్దులు కాల్పులు, పేలుళ్ల మోతతో దద్దరిల్లాయి. వరుసగా రెండో రోజు శుక్రవారం చీకటి పడగానే డ్రోన్లతో దాడికి పాక్‌ ప్రయత్నించింది. దీంతో పెద్ద పెట్టున యుద్ధ సైరన్లు మోగాయి. రంగంలోకి దిగిన భారత భద్రతా దళాలు పాక్‌ కాల్పులను సమర్థంగా తిప్పికొట్టాయి. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌, కశ్మీర్‌లో యూరీ, కుప్వారా, పూంచ్‌, నౌగామ్‌ సెక్టార్లలో పాక్‌ కాల్పులకు తెగబడిరది. ఇక సాంబ సెక్టార్‌, జమ్మూ, పఠాన్‌ కోట్‌, పోఖ్రాన్‌ లో మరోసారి డ్రోన్లతో పాకిస్థాన్‌ దాడి చేసింది. పాక్‌ డ్రోన్లను భారత ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ కూల్చివేసింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్‌ సరిహద్దు రాష్ట్రాల్లోని 24 ఎయిర్‌ పోర్టులను కూడా కేంద్రం మూసివేసింది. ఈ నెల 15వ తేదీ వరకు మూసివేసి ఉంటాయని స్పష్టం చేసింది. మరోవైపు, జమ్మూ కశ్మీర్‌ లో కాల్పుల మోత కొనసాగుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా తెలిపారు. తమకు కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌ లో ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని సీఎం సూచనలు జారీ చేశారు. జమ్మూ కశ్మీర్‌ పూర్తిగా బ్లాకౌట్‌ అయిందన్నారు.

400 డ్రోన్లతో దుశ్చర్య

. ఎంతో సంయమం వహిస్తున్నాం
. విదేశాంగశాఖ వెల్లడి
బ ప్రార్థనా మందిరాలే వారి లక్ష్యం

న్యూదిల్లీ: భారత్‌లోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా గురువారం రాత్రి పాకిస్థాన్‌ చేపట్టిన దాడులపై భారత విదేశాంగ శాఖ వివరాలు వెల్లడిరచింది. జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌లోని 36 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని 300 నుంచి 400 డ్రోన్లతో పాక్‌ దాడులు చేసినట్లు తెలిపింది. పాకిస్థాన్‌ తన పౌర విమానాలను రక్షణ కవచాలుగా ఉపయోగిస్తోందని వెల్లడిరచింది. ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ.. కర్నల్‌ సోఫియా ఖురేషీ, వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడిరచారు. భారత గగనతల రక్షణ వ్యవస్థలను పరీక్షించడం, నిఘా సమాచార సేకరణే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని తెలిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం టర్కీకి చెందిన ‘ఆసిస్‌గార్డ్‌ సోంగర్‌’ డ్రోన్లను ప్రయోగించినట్లు తెలిసిందన్నారు. ‘‘గురువారం రాత్రి రెచ్చగొట్టే చర్యలకు దిగిన పాకిస్థాన్‌.. నియంత్రణ రేఖ వెంట ఉల్లంఘనకు పాల్పడుతూ దాడులకు తెగబడిరది. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. పాకిస్థాన్‌ నుంచి 300 నుంచి 400 డ్రోన్ల వరకు వచ్చాయి. వీటిలో అనేక డ్రోన్లను కూల్చేశాం. పంజాబ్‌ సరిహద్దుల్లో పూర్తి అప్రమత్తంగా ఉన్నాం. ఈ దాడుల్లో అనేకమంది గాయపడ్డారు. పాక్‌ దాడులను భారత వాయుసేన సమర్థంగా అడ్డుకుంది. ప్రార్థనా మందిరాలే లక్ష్యంగా పాక్‌ దాడులు చేస్తోంది. ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకు పాక్‌ ప్రయత్నిస్తోంది. పాకిస్థాన్‌ డ్రోన్‌, క్షిపణి దాడులు మొదలుపెట్టినప్పటికీ.. అక్కడి పౌర విమానాలకు గగనతలాన్ని మూసివేయలేదు. కరాచీ, లాహోర్‌ మధ్య విమాన సర్వీసులు నడుస్తూనే ఉన్నాయి. తమ దాడులకు భారత్‌ నుంచి ప్రతిస్పందన ఉంటుందని తెలిసీ.. పౌర విమానాలను పాకిస్థాన్‌ రక్షణ కవచంగా వాడుకుంటోంది. ఇది భారత్‌-పాక్‌ మధ్య అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో వెళ్లే విమానాలతోపాటు అక్కడి పౌర విమానాలకు సురక్షితం కాదు. అంతర్జాతీయ విమానాలను దృష్టిలో ఉంచుకొని భారత వాయుసేన పూర్తి సంయమనంగా వ్యవహరించింది’’ అని రక్షణశాఖ ప్రతినిధులు కర్నల్‌ సోఫియా ఖురేషీ, వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌లు వెల్లడిరచారు. ‘పాకిస్థాన్‌ దాడులకు ప్రతిస్పందనగా, పాక్‌లోని 4 వైమానిక రక్షణ ప్రదేశాలపై సాయుధ డ్రోన్‌లను ప్రయోగించాం. ఆ డ్రోన్లలో ఒకటి పాకిస్థాన్‌కు చెందిన ఏడీ రాడార్‌ను నాశనం చేసింది. పాకిస్థాన్‌ నియంత్రణ రేఖ వెంబడి భారీ-క్యాలిబర్‌ ఆర్టిలరీ తుపాకులు, డ్రోన్‌లు, ఫిరంగి దాడులకు పాల్పడిరది. దీంతో భారత సైనికులకు కొంత మేరకు నష్టం, గాయాలు అయ్యాయి. అయితే భారత్‌ దెబ్బకు పాకిస్థాన్‌ సైన్యం భారీగా నష్టాన్ని చవిచూసింది’’ అని తెలిపారు. భారత్‌. భారత సైన్యం దేశ సార్వభౌమత్వాన్ని, దేశ ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి కట్టుబడి ఉందని.. అన్ని దుర్మార్గపు కుట్రలకు తుత్తునియలు చేస్తామని స్పష్టం చేశారు.

ముష్కరుల కాల్పుల్లోతెలుగు బిడ్డ వీరమరణం

0

విశాలాంధ్ర-గోరంట్ల:శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన జవాను మురళీ నాయక్‌ జమ్మూకశ్మీర్‌లో వీరమరణం పొందారు. గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ కల్లితండాకు చెందిన మురళీనాయక్‌ మృతిచెందినట్లు కుటుంబసభ్యులకు శుక్రవారం ఉదయం సమాచారం అందింది. సరిహద్దులో చొరబాటుదారుల కాల్పుల్లో ఆయన మృతిచెందినట్లు అధికారులు వారికి తెలిపారు. 2022లో అగ్నివీర్‌ జవానుగా సైన్యంలో చేరిన మురళీనాయక్‌… రెండు రోజుల క్రితం వరకు నాసిక్‌లో విధులు నిర్వర్తించారు. భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్మీ అధికారులు ఆయనను నాసిక్‌ నుంచి జమ్మూకశ్మీర్‌కు పిలిపించారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున చొరబాటుదారుల కాల్పుల్లో మురళీనాయక్‌ మరణించారు. ఈ సమాచారం తెలియడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పరస్పర కాల్పుల్లో ఐదుగురు పాక్‌ ముష్కరులను చంపి… మురళీ నాయక్‌ చనిపోయారు. శ్రీనివాస్‌ నాయక్‌, జ్యోతిబాయిలకు మురళీ నాయక్‌ ఏకైక సంతానం. ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు సోమందే పల్లె మండల కేంద్రంలోని విజ్ఞాన్‌ స్కూల్లో చదువుకున్నాడు. 2022 అగ్నివీర్‌ ద్వారా ఆర్మీకి ఎంపికయ్యాడు. నాసిక్‌, పంజాబ్‌లో పనిచేశాడు. ప్రస్తుతం ఆయన భౌతికకాయం దిల్లీ చేరుకుంది. శనివారం ఉదయం స్వగ్రామంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. మరోవైపు మురళీ నాయక్‌ తల్లిదండ్రులను సీఎం చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. మంత్రి సవిత కల్లితండాకు వెళ్లి తల్లిదండ్రులను ఓదార్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 లక్షల చెక్కును మురళీనాయక్‌ తల్లిదండ్రులకు ఆమె అందజేశారు. చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడిరచారు.
ఒక్కగానొక్క కుమారుడు పాక్‌ సైనికుల కాల్పుల్లో మృతి చెందడంపై తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. దేశం కోసం చస్తా… దేశం కోసం ఆర్మీలోనే ఉంటా అనేవాడని కుమారుడి మాటలు గుర్తు చేసుకున్నారు. మురళీ నాయక్‌ నిన్న ఉదయం తమతో మాట్లాడాడని, అవే చివరి మాటలని రోధించడం కలచివేసింది. తెల్లవారు జామున మూడు గంటలకు జరిగిన కాల్పుల్లో మృతిచెందినట్లు ఉదయం ఆర్మీ కమాండ్‌ కంట్రోల్‌ కార్యాలయం నుంచి తమకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారని తెలిపారు.
చంద్రబాబు, పవన్‌, జగన్‌ సంతాపం
వీరజవాను మురళీ నాయక్‌ మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంతాపం తెలిపారు. మురళీనాయక్‌ కుటుంబానికి అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దేశం కోసం మురళీ ప్రాణాలు అర్పించారని పవన్‌ అన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉషశ్రీ చరణ్‌ మురళి తల్లిదండ్రులను పరామర్శించారు. జగన్‌మోహన్‌ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిరచారు. మీకు వైసీపీ అండగా ఉంటుందని, త్వరలోనే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తానని జగన్‌ చెప్పారు. యుద్ధభూమిలో పోరాడుతూ మురళీ నాయక్‌ వీరమరణం పొందడం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. మురళీ నాయక్‌ చూపిన ధైర్య సాహసాలు రాష్ట్రానికే గర్వకారణమని పేర్కొన్నారు. మురళీ నాయక్‌ అంత్యక్రియలు రాష్ట్రప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జరిపిస్తామని తెలిపారు. ఆయన కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తామని లోకేశ్‌ హామీ ఇచ్చారు.

‘ది వైర్‌’పై నిషేధం

0

. ఐటీ చట్టం కింద వెబ్‌సైట్‌ బ్లాక్‌
. నిజమైన వార్తలే అందించాం: సిబ్బంది

న్యూదిల్లీ : ప్రముఖ డిజిటల్‌ వార్తా సంస్థ ‘ది వైర్‌’పై కేంద్రం చర్యలు తీసుకుంది. వార్తా సంస్థ వెబ్‌సైట్‌ను దేశవ్యాప్తంగా నిషేధించింది. ఐటీ చట్టం`2000లోని నిబంధనల ప్రకారం ఈ మేరకు చర్యలకు ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో ది వైర్‌ వెబ్‌సైట్‌ అందుబాటులో లేదని ఇంటర్‌నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ (ఐఎస్‌పీలు) ధ్రువీకరించాయి. తాజా పరిణామంపై శుక్రవారం ది వైర్‌ ఒక బహిరంగ ప్రకటన చేసింది. తమ సంస్థ వెబ్‌సైట్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించినట్లు వెల్లడిరచింది. ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ ఉత్తర్వుల ప్రకారం ఈ చర్యలు తీసుకోబడ్డాయని తెలిపింది. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని, న్యాయపరంగా ఉన్న అవకాశాలను అన్వేషిస్తున్నామని ది వైర్‌ వెల్లడిరచింది. ఇదిలావుంటే, తామెప్పుడు నిజమైన, కచ్చితమైన వార్తలను పాఠకులకు అందించడానికి కట్టుబడినట్లు ది వైర్‌ సిబ్బంది చెప్పారు. తమ వార్తా సేకరణ అన్ని వేళలా వాస్తవాలాధిరతమేనని చెప్పారు. పదేళ్లకుపైగా తమకు అండగా నిలిచినందుకు వ్యూయర్స్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ది వైర్‌ వెబ్‌సైట్‌ను దేశవ్యాప్తంగా నిషేధించడానికి సంబంధించి ఐటీ శాఖ నుంచి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

అయ్యప్ప దేవాలయమునకు రథము అందవేత

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని కేశవ నగర్ లో ఈనెల 14వ తేదీన అయ్యప్ప స్వామి దేవాలయం ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి దేవాలయమునకు అయ్యప్ప పండుగలలో పలు కార్యక్రమాలకు రథము అవసరముంటుంది అన్న సంకల్పంతో పట్టణంలోని ఓంకార్ సిల్క్స్ కు చెందిన అయ్యప్ప భక్తాదులు ఆలయంలో రథమును అందజేశారు. ఈ సందర్భంగా ఓంకార్ సిల్క్స్ అధినేతలు మాట్లాడుతూ మా కుటుంబంలోని పూర్వీకుల నుండి గత 30 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామిని కొలుచుచున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం పట్టణంలో అయ్యప్ప దేవాలయం ప్రతిష్టించడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగించిన సందర్భంలో ఒక అయ్యప్ప భక్తులుగా తమ కుటుంబం తరఫున ఒక రథమును ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ రథమును బెంగళూరులో రెండు నెలలుగా తయారుచేసి, విడిభాగాలను ఇక్కడ వచ్చి అమర్చడం జరిగిందని తెలిపారు. తదుపరి దేవాలయ నిర్మాణ వ్యవస్థాపకులు గురుస్వామి విజయ్ కుమార్, కీర్తిశేషులు కలవల నాగరాజు కుటుంబ సభ్యులు, బండపల్లి వెంకట జయప్రకాష్ ఓంకార్ సిల్క్స్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలుపుతూ, వారు ఆశీస్సులను అందజేశారు.

పల్లకి ఉత్సవములో ఊరేగిన చెన్నకేశవుడు..

ఆలయ ఈవో వెంకటేశులు, అడ హక్ కమిటీ చైర్మన్ చెన్నంశెట్టి జగదీశ్వర ప్రసాద్
విశాలాంధ్ర -ధర్మవరం; పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయం వారి బ్రహ్మోత్సవ వేడుకలు 5వ రోజు దాతలు, భక్తాదులు, ఆలయ ఈవో వెంకటేశులు, అడహక్ కమిటీ చైర్మన్ చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఉదయంపల్లకి ఉత్సవంలో స్వామివారు పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. తొలుత అర్చకులు కోనేరాచార్యులు, మకరందబాబు ,చక్రధర్ లు వేదమంత్రాలు ,మంగళ వాయిద్యాలయం ప్రత్యేక అర్చనలు, పూజలు చక్కటి అలంకరణ గావించారు. వాహనానికి ఉభయ దాతలుగా వ్యవహరించిన వారి పేరిటన ప్రత్యేక పూజలను నిర్వహించారు. తదుపరి వారిని చైర్మన్ ఘనంగా శాలువాతో సత్కరించారు. తదుపరి పట్టణ పురవీధుల గుండా ప్రత్యేకమైన వాహనంలో స్వామివారు ప్రజల దర్శనార్థం ఊరేగించారు. ఈ సందర్భంగా అన్నమయ్య సేవా మండలి అధ్యక్షులు పోరాల్ల పుల్లయ్య వారి శిష్య బృందం ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉభయ దాతలతో పాటు పట్టణ పుర ప్రముఖులు, ఆలయ సిబ్బంది రామశాస్త్రి, మల్లికార్జున, భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తెలుగు కథలు, ఇంగ్లీష్ గ్రామర్ పై మెలకువలపై అవగాహన..

గ్రంథాలయ అధికారిని. అంజలి సౌభాగ్యవతి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో 9వ రోజు తెలుగు కథలు, ఇంగ్లీష్ గ్రామర్పై మెలకువలను, శిక్షణగా ఇవ్వడం జరిగిందని గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. ఈ సందర్భంగా అంజలి సౌభాగ్యవతి మాట్లాడుతూ చదువుతోపాటు తెలుగు ఇంగ్లీష్ విషయాలపై
మెలుకువలను తెలుసుకున్నప్పుడు ఎంతో ఉపయోగపడుతుందని, సులభతరం అవుతుందని తెలిపారు. ధ్యాన యోగం కూడా శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు.ఈ శిబిరం జూన్ 6వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రంథాలయాలలో చదువు, పోటీ పరీక్షలు, వివిధ విభాగాలకు చెందిన అంశాలకు గల పుస్తకాలు కూడా ఉచితంగా లభిస్తాయి అంతేకాకుండా మా గ్రంథాలయంలో ఉచిత సభ్యత్వములు కూడా నిర్వహిస్తున్నామని కేవలం ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చినచో, రుసుమును దాతల ద్వారా సేకరించడం జరుగుతుందని ఇటువంటి అవకాశాన్ని కూడా పాఠకులు, నిరుద్యోగులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలో 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణ నాయక్, సత్యనారాయణ, శివమ్మ, గంగాధర్, పాఠకులు పాల్గొన్నారు.

నేత్రదానం చేసిన వృద్ధుడు.. విశ్వదీప సేవా సంఘం

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన కోదండ రామాలయ సభ్యులు అన్నం వెంకటనారాయణ మృతి చెందగా వారి కుటుంబ సభ్యుల అనుమతి మేరకు విశ్వదీప సేవా సంఘం వారు నేత్రదానంపై అవగాహన కల్పించి కుటుంబ సభ్యుల సహకారంతో విశ్వదీప సేవా సంఘం ఆధ్వర్యంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కుళ్లాయప్ప, కంటి రిట్రోల్ సెంటర్ టెక్నీషియన్ రాఘవేంద్ర, భాస్కర్, విజయ్ భాస్కర్ రెడ్డి, కంటి వైద్యులు డాక్టర్ నరసింహులు నేత్రాలను సేకరించారు. నేత్రానికి సహకరించిన కుటుంబ సభ్యులకు విశ్వదీప సేవా సంఘం వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు పి. చంద్రశేఖర్ రెడ్డి, అధ్యక్షులు సురేష్ ,ఉపాధ్యక్షులు శేఖర్ రెడ్డి తోపాటు సుబ్రహ్మణ్యం, జుజారు రఘు, కేశవరెడ్డి, ధనుంజయ, మాధవ, ప్రభాకర్ రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇసుక అక్రమ రవాణాను అధికారులు అరికట్టండి.. ఆర్డీవో మహేష్

విశాలాంధ్ర -ధర్మవరం; ధర్మవరం డివిజన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణాను సంబంధిత అధికారులు తప్పక అరికట్టాలని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డిఓ కార్యాలయంలో రెవెన్యూ అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు, గనుల అధికారులకు సమావేశాన్ని ఆర్డిఓ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అక్రమంగా ఇసుక రవాణా తరలించే వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు. మండల స్థాయి సిబ్బందికి అక్రమ రవాణా నివారణ చర్యల అమలులో తీసుకోవలసిన చర్యలు గూర్చి వివరించడం జరిగిందని తెలిపారు. అక్రమ రవాణా జరిగినట్లు రుజువైతే రవాణా చేయు వ్యక్తులు వాహనములను సీజ్ చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇసుక రవాణా పర్యవేక్షక ఇన్చార్జులు, పోలీస్ అధికారులు, రెవెన్యూ విభాగం అధికారులు పాల్గొన్నారు.