పేదరికం లేని సమాజమే లక్ష్యం
జూలై 10 కల్లా హంద్రీనీవా నీరు విడుదల
అనంతపురం పర్యటనలో సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర`ఉరవకొండ: రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందాలని, పేదరికం లేని సమాజం నిర్మించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. హంద్రీనీవా సుజల సవ్రంతి ద్వారా జులై 10 కల్లా నీరు విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మొత్తం 4,04,500 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. 2029 నాటికి పేదరికం లేని సమాజమే లక్ష్యమన్నారు. ఆర్థిక అసమానతలను తగ్గిస్తామని తెలిపారు. సాంకేతిక సద్వినియోగంతోనే ముందుకెళ్లగలమని చంద్రబాబు నొక్కిచెప్పారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం చాయాపురంలో ముఖ్యమంత్రి శుక్రవారం పర్యటించారు. హంద్రీనీవా సుజల స్రవంతి పనులను పరిశీలించారు. హంద్రీనీవా పనులపై ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. క్షేత్రస్థాయి పనులను డ్రోన్ ద్వారా పరిశీలించారు. ప్రోగ్రామింగ్ ద్వారా రోజూ ఎంతమేర పనులు చేశారో డ్రోన్ ద్వారా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. నాలుగు ఏజన్సీల ద్వారా పనులు జరుగుతున్నాయని సీఎంకు అధికారులు వివరించారు. ఇటీవల వర్షాలతో ఆటంకం కలిగిందని వారు చెప్పగా ఇక పనులు వేగవంతం కావాలని, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అనంతరం చాయాపురం ప్రజావేదికలో పాల్గొన్నారు. భారత్-పాక్ పోరులో అమరుడైన శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ మురళీ నాయక్కు సీఎం నివాళులర్పించారు. ఫోన్ చేసి నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. పాకిస్థాన్ కవ్వింపులకు పాల్పడటం మంచిది కాదని, దేశ పోరాటానికి ప్రతి ఒక్కరూ సంఫీుభావం తెలపాలని చంద్రబాబు అన్నారు. ‘భారత్ మాతాకు జై’ అని నినదాలిచ్చారు. పేదరికం వల్ల ఎవరికీ చదువుకోలేని పరిస్థితి రాకూడదన్నారు. అండదండలు లేక ఎంతో మంది కూలీలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘పేదవాళ్లను పైకి తెచ్చేందుకు… కిందిస్థాయిలో ఉన్న 20 శాతం మందికి అండగా నిలుద్దాం. సూచనలు, సలహాలే కాదు… అవసరమైతే డబ్బు ఖర్చు చేద్దాం’ అని పిలుపునిచ్చారు. ఆర్థిక అసమానతలు తగ్గించడమే మా ప్రభుత్వ లక్ష్యమని సీఎం అన్నారు. కష్టపడి చదువుకుని పైకి వచ్చినవారు ఎంతో మంది ఉన్నారని, సరైన సమయంలో సరైన మార్గదర్శకత్వం లభిస్తే జీవితంలో పైకి రాగలమన్నారు. వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చేశామన్నారు. ఉరవకొండకు టెక్స్టైల్ పార్క్, పొట్టిపాడు దగ్గర బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు, కొట్టాలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేస్తున్నామన్నారు. జీడిపల్లి నిర్వాసితులకు వెంటనే పరిహారమిస్తామన్నారు. 40 వేల ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పునరుద్ధరిస్తామని చెప్పారు. రామసాగరం బ్రిడ్స్, జీడిపల్లి, భైరవారి తిప్ప, పేరూరు సహా అన్నింటికి ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేస్తామని వెల్లడిరచారు. చాయాపురం గ్రామాభివృద్ధికి సహాయం అందిస్తామన్నారు. ఆగస్టు 15 నాటికి 20 లక్షల కుటుంబాల బాధ్యత తీసుకునే మార్గదర్శులను సిద్ధంచేస్తామని సీఎం చెప్పారు. బంగారు కుటంబంగా ఎంపికైన చాయాపురం గ్రామస్థురాలు పార్వతి కుటుంబానికి అండగా నిలుస్తామని చంద్రబాబు తెలిపారు. ‘ఇల్లు కట్టిస్తాం. ఆమె నలుగురు పిల్లలకు ఒకొక్కరికి రూ.లక్ష డిపాజిట్ చేస్తాం. తల్లికి వందనం కింద రూ. 15 వేలు ఇస్తాం’ అని చెప్పారు. పార్వతికి, ఆమె భర్తకు ఉపాధి కల్పించే బాధ్యతను మార్గదర్శులు తీసుకోవాలన్నారు. మార్గదర్శి అనంతయ్య ముందుకొచ్చి పార్వతి కుటుంబానికి అన్ని విధాలా సాయం చేస్తానని, మా కంపెనీలో సెక్యూరిటీ గార్డ్గా పార్వతి భర్తకు ఉద్యోగం ఇస్తానని చెప్పారు. ఆమె పిల్లల చదువుకయ్యే ఖర్చు మొత్తం భరిస్తానన్నారు. 20ఏళ్లుగా సేవ చేస్తున్నానని, వందల కుటుంబాలను బంగారు కుటుంబాలుగా తయారు చేశానని అనంతయ్య చెప్పుకున్నారు.