విశాలాంధ్ర – తూర్పుగోదావరి :
సాధారణ తనిఖీల్లో భాగంగా ఈవీఎంల గోడౌన్ను పరిశీలించినట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు.గురువారం ఉదయం స్థానిక ఎఫ్సిఐ గోడౌన్లో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ను కలెక్టర్ పి. ప్రశాంతి, రాజమండ్రి ఆర్డీవో ఆర్. కృష్ణ నాయక్, తహసిల్దార్ పాపారావు, ఇతర రెవిన్యూ సిబ్బంది పోలీసు లతో కలిసి తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ప్రతి నెలా ఈవీఎంల గోడౌన్లను తనిఖీ చేస్తున్నామని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈవీఎంల యూనిట్లు (బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వివి ప్యాట్) అత్యంత భద్రతతో స్ట్రాంగ్ రూమ్లలో ఉంచి, సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా సీసీ కెమెరాల పనితీరును కూడా ఈ తనిఖీలో సమీక్షించినట్లు తెలిపారు.


