జి యెస్ టి తగ్గింపు లో ద్వంద్వ వైఖరి
ఇదీ.. జిల్లాలో మందుల దుకాణాదారుల పరిస్థితి
విశాలాంధ్ర బ్యూరో – తూర్పుగోదావరి : దేవుడు వరమిచ్చినా పూజారులు మాత్రం అనుగ్రహించటం లేదు అనేది నానుడి అయినా… జీఎస్టీ విషయంలో అడిగితే తగ్గింపు లేదంటే వడ్డించేస్తున్నారు అంటే యధావిధిగా జీఎస్టీ వసూలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ఆర్భాటంగా ప్రారంభించిన సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్స్ పధకం నేడు పక్కదారి పడుతుందా… ఓ సామాజిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టిన ఈ పధకానికి కొంతమంది దుకాణాదారులు, షాపు యజమానులు తూట్లు పొడుస్తూ సామాన్యులకు పెద్ద మొత్తంలో చిల్లులు పెడుతున్నారు. మందుల ధరలు నానాటికీ పెరిగి పోతున్నాయని, వాటి ధరలను కొంచెమైనా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం సూపర్ జిఎస్ టి సూపర్ సేనింగ్స్ పధకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ క్రమంలో వివిధ వస్తువులకు మల్లే మందుల మీద కూడా జిఎస్ టి ని తగ్గించింది. అయితే ఆ జిఎస్ టి ఫలాలు సామాన్యుడికి అందకుండా తగ్గించిన జిఎస్ టి సొమ్మును కూడా తమ జేబులో వేసుకుంటున్న పరిస్థితులు నేడు జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరం మరియు జిల్లా లో దాపురించాయి. ఒక్క జిల్లా కేంద్రమైన రాజమండ్రిలో సుమారు 500 హోల్సేల్ మందుల దుకాణాలు ఉన్నాయి. అలాగే 2000 పై చిలుకు రిటైల్ దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి రోజూ లక్షల రూపాయల మందుల వ్యాపారం జరుగుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మందుల మీద ధరలను తగ్గించాలని, సామాన్యులకు వెసలు బాటు కల్పించాలని మందుల మీద ఉన్న 14 శాతం జిఎస్టి ని 5 శాతానికి తగ్గించింది. అంటే తొమ్మిది శాతం జిఎస్ టి ని తగ్గించింది. సాధారణంగా ఏ మందుల దుకాణాదారుడైన మందులు కొనుగోలు చేసిన వ్యక్తికి ఆ తొమ్మిది శాతం తగ్గించి ధరలు తీసుకోవాలి. కానీ నేడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రాజమండ్రి, దాని చుట్టు పక్కల ప్రాంతాలలోని దుకాణాదారులు తగ్గించిన జిఎస్టిని సామాన్యులకు ఇవ్వకుండా తమ జేబులు నింపుకుంటున్నారు. పాత ధరలకు మాత్రమే మందులు విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలిసి ఎవరైనా అడిగితే ఓ ఐదో పదో తగ్గించి చేతులు దులుపుకుంటున్నారు. అడగక పోతే మాత్రం పూర్తిగా తీసేసుకుంటున్నారు. మందుల దుకాణాదారులు ఇంత బహిరంగంగా ప్రజల నుంచి దోపిడీ చేస్తున్నా పట్టించుకున్న నాధుడు లేడు.. సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నా అడిగే డ్రగ్ ఇన్ స్పెక్టర్ గాని, అధికారులు కానీ కనిపించక పోవడం నేడు చర్చనీయాంశమైంది. సాధారణంగా నేడు ఏ మందుల దుకాణాదారుడైనా తమ మందులను అమ్ముతున్నపుడు తగ్గించిన జిఎస్టి తో డబ్బులు వసూలు చేయాలి. కానీ నేడు ఆ పరిస్థితి లేదు.. గతంలో ఉన్న మందులను సైతం పాత ధరలకు అమ్ముతూ తమ జేబులు నింపుకుంటున్నారు. ఇక నేడు నగరంలో ఉన్న మందుల దుకాణాలతో పాటు వివిధ ఆసుపత్రుల ప్రాంగణాలలో కూడా మందులు దుకాణాలున్నాయి. అక్కడ కూడా ఇలాంటి పరిస్థితే నెలకొనడం దారుణం. సామాన్యులను అమాయకులను చేసి దోచుకుంటున్నా పట్టించుకున్న నాధుడు కనిపించడం లేదు. మరో వైపు గతంలో చాలా మందుల షాపులు వినియోగదారుడు తీసుకున్నమందుల మీద 10 శాతం రాయితీ ఇచ్చేవారు. కానీ నేడు ఆ సంస్కృతిని కూడా చాలా మంది దుకాణాదారులు తూట్లు పొడుస్తున్నారు. ఇక ప్రయివేటు ఆసుపత్రుల ప్రాంగణాలలో మందులు కొంటే సరేసరి. అక్కడ పూర్తి ఎమ్మార్పీ రేట్లకే మందులు అంటగడతారు. ఇంత వ్యవహారం జరుగుతున్నా, డ్రగ్స్ రేట్లను పర్యవేక్షించాల్సిన అధికారులు, యంత్రాంగం ఉన్నా దానిని పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అసలు జిఎస్టిని తగ్గించింది సామాన్యులకు ధరలు తగ్గించడానికా, లేక దుకాణాదారుల జేబులు నింపడానికా అని ప్రజలు బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చేవలొడిగి నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం వల్ల అది మందుల దుకాణాదారులకి వరంగా మారింది. అంతేకాదు తమని ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమా మందుల దుకాణాదారులలో కనిపించడం వెనక అవినీతి అధికారుల హస్తమే ప్రధాన కారణమన్న విషయం బోధ పడుతుంది. మరో విషయం ఏమిటంటే మందులు కొనుగోలు చేసే ప్రతి వ్యక్తి ఆ మందులు ఎప్పుడు తయారు చేసి తేదీని అనుసరించి డబ్బు చెల్లించాలి. ఒక వేళ జిఎస్టికి తరువాత ఆ మందులు తయారైత పర్వాలేదు కానీ జిఎస్ టి కి ముందు తయారైతే కచ్చితంగా షాపు యజమానులను నిలదీయాల్సిన అవసరం ఉంది.కానీ నేడా పరిస్థితి లేదు.. నేడు ఎంత మంది వినియోగదారులు తాము కొన్న మందులు ఎప్పడు ఏ తేదీన తయారు చేశారన్న విషయాన్ని గమనిస్తున్నారు.. ఎంత మంది వినియోగదారులకు తమకు అదనంగా తగ్గించిన జిఎస్టిని కూడా మందుల దుకాణాదారులు కొల్లగొడుతున్నారని తెలుసు.. ఇలా ప్రజలలో చైతన్యం రానంత వరకు ప్రభుత్వాలు ఎన్ని పధకాలు పెట్టినా అవి అధికారులు, అవినీతిపరులైన దుకాణాదారుల జేబులు నింపుతాయి తప్ప సామాన్యుడికి ఒరింగేమీ లేదు. ఇకనైనా అధికారులు దుకాణదారులపై చర్యలు తీసుకుంటూ అందరికీ మందులు తగ్గింపు ధరలకు అందేలా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. అడిగితే తగ్గించటం అడగకపోతే వడ్డించటం అనే పద్దతి మానుకోవాలని ప్రజలు భావిస్తున్నారు.


