అక్టోబర్ నెలకు రాష్ట్రంలో ఆరోగ్య ర్యాంకింగ్స్లో తూర్పు గోదావరి కి అగ్రస్థానం*

– కలెక్టర్ కీర్తి చేకూరి
– డి ఎమ్ హెచ్ వో వెంకటేశ్వర రావు
విశాలాంధ్ర – తూర్పుగోదావరి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2025 వరకు విడుదల చేసిన జిల్లాల వారీ పనితీరు గణాంకాలను అనుసరించి తూర్పు గోదావరి జిల్లా 75.54 శాతం మార్కులతో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించడం అత్యంత గర్వకారణమని కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అందించిన సేవల నాణ్యత, క్షేత్ర స్థాయి పని తీరు, ఆరోగ్య ప్రచార కార్యక్రమాల అమలులో చూపిన క్రమశిక్షణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ ర్యాంక్ జిల్లా టీమ్ కష్టానికి ప్రతిఫలమని కలెక్టర్ తెలిపారు. అలాగే, ఈ ర్యాంక్తో ఆగిపోకుండా రాబోయే నెలల్లో శాతం సాధనను మరింతగా పెంచే దిశగా కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. మనపై మరింత బాధ్యత పెరిగిందని, వొచ్చిన ర్యాంకు నిలబెట్టుకునే దిశగా అన్ని విభాగాలు ముందడుగు వేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఈ విజయాన్ని సాధించడంలో కలెక్టర్ కీర్తి చేకూరి గారి సమగ్ర మార్గదర్శకం, నిరంతర పర్యవేక్షణ, సమన్వయకర్తృత్వం కారణంగానే సాధ్యమైందని జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి డా. కె. వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. జిల్లాలోని ఆరోగ్య సేవల ప్రతి విభాగం ప్రోగ్రామ్ అధికారులు, మెడికల్ ఆఫీసర్లు, పారా మెడికల్ సిబ్బంది, ANMs, ASHAs, సూపర్వైజర్లు, ICDS టీమ్స్, ఫీల్డ్ వర్కర్లు—అందరి కృషిని ఒకే దారిలో నడిపించి, లక్ష్యాలను చేరుకునేలా చేసిన కలెక్టర్ మార్గదర్శకం జిల్లా ర్యాంక్ను రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానానికి చేర్చిందని డీఎంహెచ్వో వివరించారు. అలాగే, జిల్లా ఆరోగ్య కార్యకలాపాలను సమర్థవంతంగా సమన్వయం చేయడంలో, సమస్యలను వేగంగా పరిష్కరించడంలో కలెక్టర్, ఇతర అనుబంధ శాఖల మద్దతు కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఈస్ట్ గోదావరి జిల్లా తరఫున ఆరోగ్య శాఖ అందించిన అద్భుత ఫలితాలకు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఇదే ఉత్సాహంతో ప్రజారోగ్య సేవలను మరింత బలోపేతం చేస్తామని జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ ప్రకటించింది.


