విశాలాంధ్ర, ఉరవకొండ: అనంతపురం జిల్లా దేవాదాయ శాఖలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నిర్వహించిన ట్రాప్లో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గంజి మల్లికార్జున ప్రసాద్ రూ.25 వేల లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ప్రస్తుతం ఆయన ఉరవకొండ శ్రీ గవి మఠం దేవాలయానికి ఇన్చార్జి అసిస్టెంట్ కమిషనర్గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో ఈ ఘటనకు ప్రాధాన్యం ఏర్పడింది. పుట్లూరు మండలం రామలింగేపల్లి గ్రామంలోని ఆలయ నిర్మాణానికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మంజూరైన నిధుల్లో మిగిలిన రూ.2 లక్షలు విడుదల చేయాలంటే రూ.25 వేల లంచం ఇవ్వాలని ఆలయ కమిటీ చైర్మన్ను అసిస్టెంట్ కమిషనర్ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారు పక్కా ప్రణాళికతో ట్రాప్ నిర్వహించారు.అనంతపురంలోని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదుదారుడి నుంచి రూ.25 వేల లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు గంజి మల్లికార్జున ప్రసాద్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న అధికారి ఏసీబీ ట్రాప్లో చిక్కడం, అదే సమయంలో ఉరవకొండ శ్రీ గవి మఠం ఇన్చార్జి అధికారిగా కొనసాగుతుండటం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


