దేశంలో ఇకపై దగ్గు సిరప్లను మెడికల్ షాపుల్లో నేరుగా కొనుగోలు చేయడం కుదరదు. డాక్టర్ ఇచ్చిన చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్ ఉంటేనే విక్రయించాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది.‘డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్‘ చట్టంలోని షెడ్యూల్-కే జాబితా నుంచి ‘సిరప్‘ అనే పదాన్ని తొలగించింది. దీంతో ఇప్పటివరకు ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించే దగ్గు సిరప్లు ఇకపై వైద్యుల సూచనతోనే అందుబాటులోకి రానున్నాయి. గతేడాది డిసెంబర్లో దీనిపై ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేయగా.. అభ్యంతరాలు రాకపోవడంతో తుది నిర్ణయం తీసుకుంది.
ఇటీవల భారత్లో తయారైన కొన్ని దగ్గు సిరప్లు కలుషితమై పిల్లల మరణాలకు కారణమైనట్లు ఆరోపణలు రావడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. గతేడాది రాజస్థాన్లో కలుషిత సిరప్ సేవించి 22 మంది చిన్నారులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పరీక్షల్లో ప్రమాదకర రసాయనం డైఎథిలిన్ గ్లైకాల్ అధిక మోతాదులో ఉన్నట్లు తేలింది. గాంబియా, ఉజ్బెకిస్థాన్, కామెరూన్ వంటి దేశాల్లోనూ భారత్లో తయారైన దగ్గు సిరప్లకు సంబంధించి వివాదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఔషధాల నాణ్యత, నియంత్రణ వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.


