రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించిన మంత్రి
హోం మంత్రికి ప్రజల నుంచి అభినంధనల వెల్లువ
విశాలాంధ్ర -యస్ .రాయవరం (అనకాపల్లి జిల్లా ):కష్టమంటే చాలు క్షణం ఆలోచించకుండా ఆపన్న హస్తం అందించే హోంమంత్రి అనిత మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. యలమంచిలి సమీపంలో రోడ్డుప్రమాదం జరిగింది. అదే సమయంలో విశాఖపట్నం నుంచి నక్కపల్లి వెళ్తున్న అనితమ్మ ఘటన చూసి చలించిపోయారు. కాన్వాయ్ ఆపి స్వయంగా వారిని కాపాడేందుకు శ్రమించారు. క్షతగాత్రులకు సపర్యలు చేయడంతో పాటు దగ్గరుండి వాహనాల్లో వారిని యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. స్వయంగా క్షతగాత్రులకు సాయం చేస్తూ వారిని అంబులెన్సుల్లోకి ఎక్కించడమే కాకుండా సిబ్బందికి సూచనలిస్తూ వారిని వేగంగా ఆస్పత్రికి తరలించారు.
వెంటనే యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. దగ్గరుండి మరీ వారి వైద్యసేవలను పరిశీలించారు. అమ్మలా మారి వారికి సపర్యలు చేస్తూ.. వారిలో ధైర్యం నింపారు. ఓ సామాన్య మహిళలా మారి గాయపడిన వారికి సపర్యలు చేస్తూ, వారిని ఓదారుస్తూ నిలబడిన హోంమంత్రిని చూసి ప్రజలు నాయకురాలంటే ఇలా ఉండాలి అని అభినందిస్తున్నారు.


