Homeజాతీయందిగుమతి సుంకం పెంపు.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు...

దిగుమతి సుంకం పెంపు.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు…

- Advertisement -

విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకే సుంకం పెంపు అన్న ప్రభుత్వం
అంతర్జాతీయ మార్కెట్‌లోనూ స్వల్పంగా పెరిగిన ధరలు
బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం రెట్టింపు కంటే ఎక్కువగా పెంచడంతో నేడు బులియన్ మార్కెట్‌లో ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మల్టీ కమొడిటీ ఎక్స్‌ఛేంజ్ (ఎంసీఎక్స్‌)లో పసిడి, వెండి ధరలు ఏకంగా 8 శాతం వరకు ఎగబాకి సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఈ నిర్ణయంతో దేశీయ మార్కెట్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి.

ఎంసీఎక్స్‌లో జూన్ 5 ఫ్యూచర్స్ గోల్డ్ ధర నేటి ట్రేడింగ్‌లో 7.20 శాతం అంటే రూ.11,055 పెరిగి, ఒక దశలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,64,497 వద్ద ఇంట్రాడే గరిష్ఠానికి చేరింది. ఉదయం 9:50 గంటల సమయానికి ఈ రికార్డు స్థాయిని తాకింది. అంతకుముందు రూ.1,54,851 వద్ద ప్రారంభమైనప్పటికీ సుంకం పెంపు వార్తలతో ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం 6 శాతం పెరుగుదలతో రూ.1,62,728 వద్ద ట్రేడ్ అవుతోంది.

బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. జూలై 3 ఫ్యూచర్స్ సిల్వర్ ధర ఏకంగా 8 శాతం అంటే రూ.22,367 పెరిగి, కిలో వెండి ధర రూ.3,01,429 అనే ఆల్-టైమ్ హై స్థాయిని తాకింది. ప్రస్తుతం 6.66 శాతం పెరుగుదలతో రూ.2,97,655 వద్ద ట్రేడ్ అవుతోంది.

కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని (సెస్‌తో కలిపి) 6 శాతం నుంచి ఏకంగా 15 శాతానికి పెంచింది. ప్లాటినంపై దిగుమతి సుంకాన్ని 6.4 శాతం నుంచి 15.4 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న కరెంట్ ఖాతా లోటును (సీఏడీ) నియంత్రించడం, విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో అనవసర దిగుమతులను తగ్గించి, అత్యవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే తమ వ్యూహమని వారు వివరించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం ధరల పెరుగుదల పరిమితంగానే ఉంది. కామెక్స్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 0.52 శాతం పెరిగి 4,710 డాలర్ల వద్ద, ఔన్స్ వెండి ధర 2.28 శాతం పెరిగి 87.54 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు