ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తన రాజకీయ ప్రవేశంపై గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించారు. తాను రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్టు అధికారికంగా ప్రకటించి తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపారు. ఇటీవలే పలువురు సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి ప్రవేశిస్తుండగా ఆ జాబితాలో ఇప్పుడు లారెన్స్ కూడా చేరారు.ఈ మేరకు తన ఃఎక్స్ః ఖాతాలో ఓ ప్రకటన విడుదల చేశారు. ఁఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మీ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించండిఁ అనే వాక్యంతో తన ప్రకటనను ప్రారంభించారు. ఁనిజానికి రాజకీయాల్లోకి రావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. డబ్బు సంపాదించాలనే ఉద్దేశం గానీ, పదవి చేపట్టాలనే ఆశ గానీ నాకు లేవు. నేను ఎంతగానో విశ్వసించే, నమ్మే వ్యక్తి ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే, వారికి అండగా నిలబడి సమాజానికి విస్తృత స్థాయిలో సేవ చేయాలని మాత్రమే నేను భావించేవాడిని. కానీ, మారిన పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు నేనే స్వయంగా ఈ అడుగు వేయాల్సి వస్తోందిఁ అని లారెన్స్ తన మనసులోని మాటను పంచుకున్నారు. అయితే, ఏ రాజకీయ పార్టీలో చేరతారనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. ఆ వివరాలను త్వరలోనే తెలియజేస్తానని పేర్కొన్నారు.
అయితే, ఆయన ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని అధికార తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ గెలిచిన తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి లారెన్స్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విజయ్ పెరంబూర్, తిరుచ్చి స్థానాల నుంచి గెలిచినప్పటికీ, ప్రమాణ స్వీకారానికి ముందు తిరుచ్చి స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఇదే ఏడాది మరో ప్రముఖ నటుడు సుందర్ సి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఏఐఏడీఎంకేతో కలిసి ఎన్డీయే కూటమిలోని పుదియ నీతి కట్చి (పీఎన్కే) పార్టీ తరఫున మధురై సెంట్రల్ నుంచి పోటీ చేశారు. అయితే, ఆ ఎన్నికల్లో ఆయన 33,538 ఓట్లతో మూడో స్థానంలో నిలిచి ఓటమి పాలయ్యారు. ఆ స్థానాన్ని టీవీకే అభ్యర్థి మధుర్ బద్రుద్దీన్ కైవసం చేసుకున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే, రాఘవ లారెన్స్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో ఃబెంజ్ః అనే యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ నిర్మిస్తున్న ఈ సినిమా, ఆయన సృష్టించిన లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (ఎల్సీయూ)లో భాగంగా రానుంది. ఇందులో నివిన్ పౌలీ, రవి మోహన్, సంయుక్త ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీనితో పాటు ఆయన స్వీయ దర్శకత్వంలో ఃకాంచనః సిరీస్లో ఐదో భాగంగా ఃకాంచన 4ఃను తెరకెక్కిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే, నోరా ఫతేహి, స్వక్ష అయ్యర్, దేవదర్శిని నటిస్తున్నారు. సినిమాలతో బిజీగా ఉంటూనే, లారెన్స్ రాజకీయ అరంగేట్రంపై తీసుకున్న నిర్ణయం తమిళనాడులో ఆసక్తిని రేపుతోంది.


