న్యూదిల్లీ: గృహహింస, వేధింపులు, దాడులకు గురైన మహిళలకు సహాయం చేసేందుకు కేంద్రం ఏర్పాటుచేసిన ఏక పరిష్కార కేంద్రాల(ఓఎస్సీ) పనితీరు లోపభూయిష్ఠంగా ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ విమర్శించారు. భద్రత అనేది పథకం కాదని, అది ప్రభుత్వ ప్రాథమిక భాద్యత అని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘ఓ మహిళ హింస నుంచి తప్పించుకుని ఓఎస్సీలను ఆశ్రయించినపుడు కేంద్రాల తలుపులను ప్రభుత్వం ఎందుకు మూసేస్తోంది. సిబ్బంది కొరత సహా దేశవ్యాప్తంగా ఉన్న ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోవడం లేదు. భద్రతే ముఖ్యమైతే ప్రతి ఐదుగురు మహిళల్లో ముగ్గురికి సహాయం ఎందుకు అందట్లేదు. మహిళా-శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు కేటాయించిన ప్రతి వంద రూపాయల్లో 60 పైసలు మాత్రమే ఓఎస్సీలకు ఎందుకు ఖర్చుచేస్తున్నారు’ అని రాహుల్ తన అధికారిక వాట్సప్ ఛానల్లో ప్రశ్నల వర్షం కురుపించారు. పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయంలోనూ గత నెల 27వ తేదీన రాహుల్ ఈ విషయాన్నే లేవనెత్తారు. వీటికి కేంద్ర మహిళా-శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సావిత్రీ ఠాకుర్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఓఎన్సీలు మిషన్ శక్తిలో భాగమని, 2015 ఏప్రిల్ 1న ఇది ప్రారంభమైనప్పట్నుంచి 2025 డిసెంబరు 31 వరకు 13.37 లక్షలకు పైగా మహిళలకు దీని ద్వారా సహాయం అందిందని ఆమె పేర్కొన్నారు. ఓఎన్సీల అమలు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో ఉందని సావిత్రి స్పష్టంచేశారు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం ఎవరి మాటా వినడం లేదని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
లోపభూయిష్టంగా ఓఎస్టీల పనితీరు: రాహుల్
- Advertisement -
RELATED ARTICLES


