– కలెక్టర్ కీర్తి చేకూరి
విశాలాంధ్ర – తూర్పుగోదావరి : జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి గురువారం స్థానిక వై జంక్షన్ వద్ద జెండా ఊపి “పి ఎమ్ సూర్యఘర్ ర్యాలీ”ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, పీఎం సూర్యఘర్ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ప్రతి ఇంటికి సౌర శక్తి అందించి, విద్యుత్ ఖర్చు తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ సాధించడం అని స్పష్టం చేశారు. కార్యక్రమం రాజమహేంద్రవరం లోని వై జంక్షన్ వద్ద ప్రారంభమై, దేవి చౌక్ వరకు ర్యాలీగా కొనసాగింది. ఈ ర్యాలీ ద్వారా తూర్పు గోదావరి జిల్లాలో పీఎం సూర్యఘర్ ఏర్పాటు పై ప్రజల్లో అవగాహన కల్పించడం, పునరుత్పాదక శక్తి వనరుల వినియోగం అవసరాన్ని చాటిచెప్పడం లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రత్యేక రూట్ మ్యాప్ ప్రకారం మండల స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని ఆమె ఆదేశించారు. వనరుల పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి కుటుంబం సౌరశక్తి వినియోగాన్ని అలవరచుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, సిబ్బంది “సూర్యఘర్ – పచ్చటి భవిష్యత్తు”, “ప్రతి ఇంటికి సౌర శక్తి – విద్యుత్ ఆదా మన భాధ్యత” వంటి నినాదాలు చేశారు. స్థానిక వై జంక్షన్ నుంచి దేవి చౌక్ వరకు సాగిన ఈ ర్యాలీలో ఏపీ ఈపిడిసిఎల్ ఎస్.ఇ. కే. తిలక్ కుమార్, ఈ ఈ లు, డి ఈ లు, ఏ ఇ లు , విద్యుత్ సంస్థల అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


