కేబినెట్ నుంచి తొలగింపు.. కేబినెట్ నుంచి తనను తొలగించడాన్ని ఖండించిన కొండా సురేఖ
కూతురి వ్యాఖ్యలకు నేను బాధ్యురాలిని కాదంటూ స్పష్టీకరణ
జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డిపై చర్యలేవని సూటి ప్రశ్న
తెలంగాణ మంత్రివర్గం నుంచి తనను బర్తరఫ్ చేయడంపై మంత్రి కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను కేబినెట్ నుంచి తొలగించాలని గవర్నర్కు సిఫార్సు చేసిన నేపథ్యంలో, ఈ నిర్ణయాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, కనీసం తన వివరణ కూడా కోరకుండా ఏకపక్షంగా ఇటువంటి చర్యలు తీసుకోవడం భావ్యం కాదని ఆమె ఆక్షేపించారు. ఇటీవల తన కుమార్తె చేసిన వ్యాఖ్యల వల్ల తలెత్తిన వివాదంపై ఆమె స్పందిస్తూ, నా కుమార్తె స్వతంత్ర వ్యక్తిత్వం కలిగిన మహిళ. ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలకు నేను బాధ్యురాలిని ఎలా అవుతాను? ఆమె వ్యాఖ్యలను ఖండించాల్సిన అవసరం నాకు లేదు. ఆమె వ్యక్తిగత అభిప్రాయాలను విమర్శించే హక్కు ఎవరికీ లేదుఁ అని స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానానికి తాను సమర్పించిన లేఖను త్వరలోనే మీడియాకు విడుదల చేస్తానని ఆమె వెల్లడించారు.
ఇదే క్రమంలో పార్టీలోని ద్వంద్వ వైఖరిని ఆమె నిలదీశారు. గతంలో జగ్గారెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీ ఎటువంటి చర్యలు తీసుకుందని ఆమె ప్రశ్నించారు. కొండా సురేఖ ఉదంతంతో తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మరింత తీవ్రమవుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా, కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు లేఖ రాశారు. కొండా సురేఖ రాజీనామాకు నిరాకరించడంతో, ఆమెను బర్తరఫ్ చేయడానికే కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపింది.


