— ఆరుగురు వ్యాపారులపై కేసులు నమోదు
విశాలాంధ్ర – కడియం : మండల కేంద్రమైన కడియం మాంసం దుకాణాల వద్ద తూకాల్లో మోసంచేస్తున్న ఆరుగురు మాంసం వ్యాపారులపై తూనికలు కొలతల శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. పౌరసరఫరాల డిప్యూటీ తహశీల్దార్ సమక్షంలో అధికారులు ఆదివారం కడియంలోని మాంసం దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేశారు. తూనికలో 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు తక్కువ ఉండడం గమనించి, ఆరుగురు వ్యాపారులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు కడియం మాంసం, చేపల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి ఏడుగురు వ్యాపారులపై కేసులు నమోదు చేశామని, ఇప్పుడు మరో ఆరు కేసులు నమోదు చేశామని తెలిపారు. వినియోగదారులు వస్తువులు కొనుగోలు చేసే సమయంలో తూనికలో కానీ, కొలతల్లో కాని తేడా చేసినా, ఎమ్మార్పీ ధరలకన్నా ఎక్కవ ధరకు విక్రయిస్తున్నా తూనికలు కొలతల శాఖ టోల్ ఫ్రీ నెంబర్లు 1967, 1100 లకు ఫోన్ చేయాలని సూచించారు. లేదా రాజమహేంద్రవరం ఇన్స్ స్పెక్టర్ లకు 81069 48093, 95020 62069, అసిస్టెంట్ కంట్రోలర్ 93981 47134, నెంబర్లకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ తనిఖీల్లో తూనికలు కొలతల శాఖ ఇన్స్ పెక్టర్లు వి ప్రశాంతకుమార్, ఎస్ నాగేంద్రకుమార్, సిబ్బంది, పౌరసరఫరాల డిప్యూటీ తహశీల్దార్ కె సూర్య ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


