: ట్రంప్ కీలక వ్యాఖ్యలు
అమెరికా చేతిలో దెబ్బలు తినడం వారికి విసుగు తెప్పించి ఉంటుందంటూ టెహ్రాన్పై అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald Trump on Iran) ఎద్దేవా చేశారు. త్వరలోనే ఇరాన్ (Protests in Iran) నాయకత్వంతో సమావేశమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇరాన్పై సైనిక చర్యకు అమెరికా సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తోన్న వేళ..డొనాల్డ్ ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా బెదిరింపులతో ఇరాన్ దిగొచ్చిందని, చర్చల కోసం ఆ దేశ నాయకులు తనకు ఫోన్ చేశారని అన్నారు. ‘‘ఇరాన్ (Iran) నాయకులు నిన్న నాకు ఫోన్ చేశారు. మాతో వారు చర్చలు జరపాలనుకుంటున్నారు. ఆ దేశం తన పరిమితులు దాటినట్లుగా కన్పిస్తోంది. అక్కడి నాయకులు కేవలం హింస ద్వారానే దేశాన్ని పరిపాలిస్తున్నారు. అయితే ఆ దేశ పరిస్థితిని మా సైన్యం నిశితంగా గమనిస్తోంది. సమస్య పరిష్కారం కోసం బలమైన ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నాం. ఇరాన్ నాయకులతో సమావేశానికి ముందే మేం చర్యలు తీసుకోవాల్సి రావొచ్చు కూడా. అయితే, వారితో ఒక సమావేశం మాత్రం జరుగుతుంది’’ అని ట్రంప్ ( Trump) వెల్లడించారు. ఈ సందర్భంగా ఇరాన్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత పైనా అమెరికా అధ్యక్షుడు స్పందించారు. దీనిపై తాను స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్తో మాట్లాడాలనుకుంటున్నట్లు వెల్లడించారు. శాటిలైట్ సేవల ద్వారా ఇరాన్ (iran) లో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు, ఇరాన్లో ఆందోళనకారుల అణచివేత కొనసాగుతూనే ఉంది. నిరసనకారులు, సైన్యం మధ్య జరిగిన ఘర్షణల్లో మృతుల సంఖ్య 544కు పెరిగింది. వీరిలో 48 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. 10వేల మందికి పైగా ఆందోళనకారులను సైన్యం అరెస్టు చేసింది.
ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో కొంతమంది భారతీయులను అక్కడి సైన్యం అరెస్టు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఆరుగురు భారతీయులను అదుపులోకి తీసుకున్నట్లు పలు పోస్ట్లు వెలుగు చూశాయి. దీనిపై భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం స్పందించింది. అది తప్పుడు వార్త అని.. అలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని స్పష్టం చేసింది. ఇదిలాఉండగా.. గ్రీన్లాండ్ వ్యవహారం పైనా ట్రంప్ తాజాగా మరోసారి మాట్లాడారు. ఆ ద్వీపాన్ని అమెరికా తీసుకోకపోతే.. రష్యా లేదా చైనా స్వాధీనం చేసుకుంటాయన్నారు. గ్రీన్లాండ్ను ఆ దేశాలు వశం చేసుకోకుండా తాను అడ్డుకుంటానని అన్నారు. గ్రీన్లాండ్తో ఒప్పందానికి తాను ఇష్టపూర్వకంగా ఉన్నానని, అది సులభమని వ్యాఖ్యానించారు.


