– సిండికేట్ గా మారిన అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు …
– సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ధిక్కరిస్తున్న మద్యం వ్యాపారులు
సహకరిస్తున్న ఎక్సైజ్ అధికారులు …
– అధిక ధరల్లో మద్యం విక్రయాలు …
– బ్లాక్ లో ఏరులై పారుతున్న మద్యం …
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాల్లో పాత మద్యం అమ్మకాలు జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు మొద్దు నిద్ర నటిస్తూ మద్యం వ్యాపారులకు సహకరిస్తున్నారని ఏ.పి.రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, సి.పి.ఐ. జిల్లా కార్యవర్గ సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న నూతన మద్యం పాలసీ ప్రకారం జిల్లా ఉన్నతాధికారులు చే వేలం పాటలు నిర్వహించి, చోడవరంలో ఈ నెల 16 నుండి నూతన దుకాణాలు ఏర్పాటుకు ఎక్సైజ్ అధికారులు తాత్కాలిక పర్మిషన్ అంటూ పచ్చ జెండా ఊపారు. కొత్తగా మద్యం ప్రైవేటు దుకాణాలు ఏర్పాటు చేసారు, కానీ కొత్త దుకాణాల్లో పాత మద్యం, అధిక ధరలతో అమ్ముతుండటంతో మద్యం ప్రియులు ఆందోళన చెందుతున్నారు. సిండికేట్ గా మారిన అధికార కూటమి, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, నాయకులు సిండికేట్ గా మారి మద్యం వేలం పాటల్లోనూ, అధిక ధరలకు మద్యం అమ్మకాల్లోను ప్రజలను పట్టి పీడిస్తున్నారు. అధిక ధరలతో మద్యం అమ్మకాలు లో వ్యాపారులకు, ప్రభుత్వ పెద్దలకు ఎక్సైజ్ అధికారులు వత్తాసు పలుకుతూ సాధారణ, మధ్యతరగతి ప్రజానీకాన్ని నిలువునా దోచుకుంటున్నారు. ప్రభుత్వం, రాజకీయ నేతలు నిన్నటి వరకు కొత్తగా ప్రైవేటు మద్యం దుకాణాలు ఏర్పడుతున్నాయని, తక్కువ ధరకు మద్యం అందుబాటులో వుంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అలాగే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యం నిల్వలు లేవంటూ గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాలు మూసివేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన ప్రైవేటు మద్యం దుకాణాలు లో జగనన్న మద్యం ప్రత్యక్షమవ్వడంతో ఎక్సైజ్ అధికారులు, కూటమి ప్రభుత్వం మద్యం పై ఆడుతున్న మధ్యంతర నాటకం తేట తెల్లమవుతోంది. కూటమి ప్రభుత్వం మద్యం పాలసీ పై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ప్రకారం హై వేలు, గుడి బడికి 200 మీటర్లు దూరం వుండాలనే ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. అంతేగాక బ్లాక్ లో అధిక ధరలకు మద్యం ఏరులై పారుతుండటం మరో ఎత్తు. ఒక్కో సీసా పై రూ.100 నుండి 200 లు పైగా వేసి బ్లాక్ లో అమ్ముతున్నారని మద్యం ప్రియులు వాపోతున్నారు. రోజంతా కష్టించి పనిచేసే కార్మికులకు, అలవాటుగా మారిన మద్యం ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ప్రైవేటు దుకాణాలకు వేలం పాటలు జరిపిన ప్రభుత్వం, ఎప్పటి నుండి ప్రైవేటు మద్యం దుకాణాలు లో కొత్త మద్యం అందుబాటులో వస్తుంది అనే విషయాన్ని ఎక్సైజ్ అధికారులు స్పష్టత ఇవ్వక పోవడంతో దళారీలు, కొత్త మద్యం దుకాణదారులు అధిక ధరలు దండుకుంటున్నారు.