రాష్ట్రాలకు సుప్రీంకోర్టు హెచ్చరిక
న్యూదిల్లీ: వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంపై మంగళవారం విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం… కుక్కల బెడదను అరికట్టేందుకు చర్యలు తీసుకోకపోతే ఆయా రాష్ట్రాలపై భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ప్రతి కుక్క కాటుకు పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టంచేసింది. కుక్క కరిచిన ప్రభావం బాధిత వ్యక్తిపై జీవితకాలం ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది. వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న వారిపైనా కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ‘ఏదైనా సంస్థ ఆహారం పెడుతున్న కుక్కల దాడిలో ఓ చిన్నారి మరణిస్తే… అప్పుడు ఎవరిని బాధ్యుల్ని చేయాలి? ఆ ప్రాణనష్టానికి ఆ సంస్థ బాధ్యత వహించదా? వీధి కుక్కల బెడదను నివారించేందుకు రాష్ట్రాలు తగిన చర్యలు చేపట్టాలి. లేదంటే ప్రతి కుక్క కాటుకు, కుక్కల దాడిలో జరిగిన ప్రతి మరణానికి ఆయా రాష్ట్రాలపై మేం నిర్దేశించిన భారీ పరిహారాలు చెల్లించాలి’ అని న్యాయస్థానం స్పష్టం చేసింది. వీధికుక్కలకు ఆహారం పెట్టే వారి గురించి మాట్లాడుతూ ‘మీకు శునకాలపై అంత ప్రేమ ఉంటే… వాటిని మీ ఇంటికి తీసుకెళ్లి పెంచుకోండి. వీధి కుక్కల సమస్య భావోద్వేగభరిత అంశమని అంటున్నారు. మీ భావోద్వేగం కేవలం కుక్కల పైన మాత్రమేనా? మేం మనుషుల గురించి కూడా సమానంగా ఆందోళన చెందుతున్నాం. కుక్కలు వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయపెట్టే పరిస్థితిని మేం ఆమోదించబోం’ అని ధర్మాసనం వెల్లడిరచింది. దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడుల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో గతేడాది నవంబరులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, క్రీడా సముదాయాలు, ఇతర బహిరంగ ప్రదేశాల సమీపంలోని వాటిని షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది.


