Tuesday, July 15, 2025
Homeతెలంగాణతెలంగాణ ప్రజలకురాహుల్‌ తీరని ద్రోహం

తెలంగాణ ప్రజలకురాహుల్‌ తీరని ద్రోహం

బనకచర్లపై మౌనం కుట్రపూరితం: కేటీఆర్‌

విశాలాంధ్ర – హైదరాబాద్‌: లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సాధించింది ఏమీలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ సమస్యలు, ఈ ప్రాంతానికి హక్కుగా రావాల్సిన అంశాలపై ఏరోజూ మాట్లాడలేదన్నారు. తెలంగాణకు ద్రోహం చేయడంలో బీజేపీతో ఆయన కలిసి పనిచేస్తున్నారని గురువారం ఓ ప్రకటనలో ఆరోపించారు. తెలంగాణ రైతుల నోట్లో మట్టికొట్టే బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రాహుల్‌ మౌనంగా ఉండడం ముమ్మాటికి కుట్రే అన్నారు. గోదావరిలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటాను తన గురువు చంద్రబాబుకు రేవంత్‌ రెడ్డి ధారాదత్తం చేస్తుంటే ఆపకుండా రాహుల్‌ గాంధీతో పాటు కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. 2014 పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు రాహుల్‌ గాంధీ ప్రశ్నించలేదని కేటీఆర్‌ గుర్తుచేశారు. కాళేశ్వరం లేదా పాలుమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదో చెప్పాలన్నారు. విభజన చట్టంలో ఉన్న ఐటీ ఇన్వెస్టిమెంట్‌ రీజియన్‌ ను 2015లోనే మోదీ ప్రభుత్వం రద్దు చేస్తే రాహుల్‌… మాట మాట్లాడకుండా కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలికారన్నారు. వరంగల్‌ ప్రజల చిరకాల కోరిక అయిన కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ విషయంలో ఆయన వ్యవహరించిన తీరును ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. బొగ్గు బ్లాక్‌ లను కేటాయించకుండా సింగరేణి అస్థిత్వాన్నే మాయం చేయాలనుకున్న మోదీ ప్రభుత్వ కుట్రలపై ఆయన ఏ రోజూ లోక్‌సభలో మాట్లాడలేదన్నారు. అధికారంలోకి రావాలని ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అమలుచేయలేక రేవంత్‌ రెడ్డి చతికిలపడితే… రాహుల్‌ తప్పించుకు తిరుగుతున్నారని కేటీఆర్‌ విమర్శించారు. హామీల అమలుకు తనదే గ్యారంటీ అని గప్పాలు కొట్టిన రాహుల్‌, ఇప్పుడు తెలంగాణకు రాకుండా ముఖం చాటేశారన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు