. ప్రాధాన్యతాక్రమంలో సమస్యల పరిష్కారం
. మెడికల్ రీయింబర్స్మెంట్ రూ.180 కోట్లు విడుదల: భట్టి
విశాలాంధ్ర – హైదరాబాద్ : ఉద్యోగులు, ప్రభుత్వం … ఓ ఆదర్శ కుటుంబంగా భావించి వారి సమస్యలను ప్రాధాన్య క్రమంలో పరిష్కరిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.180.38 కోట్లు ఒకేసారి విడుదల చేసినట్టు చెప్పారు. తొమ్మిది రోజుల వ్యవధిలోనే రూ.తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసి రికార్డు సృష్టించినట్టు పేర్కొన్నారు. విపక్షాల అంచనాలను తలకిందులు చేస్తూ మరుసటి రోజే ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్మెంట్ సొమ్ము విడుదల చేయడం గొప్ప విషయమన్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపునకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. 26,519 మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట కలిగిందన్నారు. ఎంప్లాయిస్ వెల్ఫేర్ క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నట్టు చెప్పారు. డీఏలను పెంచుతూ ఈనెల 13న జీవో జారీ చేయడంతో రాష్ట్రంలోని 3.50 లక్షల మంది రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు, మూడు లక్షల మంది పెన్షనర్లకు ఆర్థిక ప్రయోజనం చేకూరిందని వివరించారు. ఒక డీఏకు ప్రతినెలా ప్రభుత్వ ఖజానాపై రూ.2,400 కోట్ల ఆర్థిక భారం అయినప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికే ప్రాధాన్యతం ఇస్తున్నట్టు తెలిపారు. వీటితోపాటు మహిళా శిశు సంక్షేమ శాఖ, ప్రణాళికా శాఖలో క్యాడర్ సంఖ్య పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసినట్టు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరుకుందన్నారు. జనాభాను అనుసరించి గ్రామపంచాయతీలను నాలుగు గ్రేడ్ లుగా విభజిస్తున్నట్టు చెప్పారు.ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ పథకం పూర్తిస్థాయిలో సిద్ధమవుతుందన్నారు. వివిధ శాఖల్లో ప్రమోషన్లకు సంబంధించిన డీపీసీ కమిటీలు వేగం పెంచినట్టు వెల్లడిరచారు.