ఏకాదశి కావడంతో ఆలయానికి భారీగా పోటెత్తిన భక్తులు
శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాశీబుగ్గ పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఏకాదశి పర్వదినం కావడంతో ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడమే ఈ విషాదానికి కారణమైంది.ఏకాదశి సందర్భంగా వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు కాశీబుగ్గ ఆలయానికి పోటెత్తారు. ఒక్కసారిగా రద్దీ పెరిగిపోవడంతో తోపులాట జరిగి, అది కాస్తా తొక్కిసలాటకు దారితీసింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే పలువురు భక్తులు కిందపడిపోయారు. వారిపై నుంచి ఇతరులు పరుగులు తీయడంతో ఊపిరాడక కొందరు అక్కడికక్కడే మృతి చెందారు.ఈ విషాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాద ఘటనలో భక్తులు మృతి చెందడం హృదయ విదారకం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు.గాయపడిన వారికి వేగంగా, సరైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు చంద్రబాబు తెలిపారు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని కోరినట్లు వివరించారు.ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


