పెనుగొండ లక్ష్మీనారాయణ,
సెల్: 94402 48778
‘‘డా॥పి.చిరంజీవినీకుమారి తెలుగునాట మహిళా చైతన్యాన్ని, అభ్యుదయ భావజాలాన్ని ప్రోది చేసిన రచయిత్రి, విదుషీమణి విద్యావేత్త. తెలుగునాట ఆమె సారస్వత సేవ తెలియని వారు లేరు. అభ్యుదయ రచయితల సంఘంలో ఆది నుంచి నిర్మాణాత్మక పాత్ర పోషించిన వ్యక్తి.’’ ఈ మంచి మాటలు అన్నది మండలి బుద్ధప్రసాద్. ఆమె వ్యక్తిత్వాన్ని, సామాజిక సేవను, కృషిని తెలుసుకోవటానికి ఈ నాలుగు మాటలు చాలు. చిరంజీవినీకుమారి సాహిత్య చిరునామా అరసం. అరసం పునర్నిర్మాణం తరువాత గుంటూరులో 1973 లో జరిగిన ఆరవ రాష్ట్ర మహాసభ నుంచి సూర్యాపేటలో2012లో జరిగిన 16 వ రాష్ట్ర మహాసభల దాకా క్రియాశీలంగా పాల్గొన్నారు. కార్యవర్గ సభ్యురాలిగా, కార్యదర్శిగా, ఉపాధ్యక్షురాలిగా సేవలు అందించారు. కాకినాడలో 1978 డిసెంబరు 24, 25తేదీలలో జరిగిన అరసం 8వ రాష్ట్ర మహాసభల నిర్వహణలో కర్త, కర్మ, క్రియ ఆమే. వందలాది మంది అభ్యుదయ, ప్రజాస్వామిక రచయితల సమీకరణతో ఎంతో సమన్వయంతో ఆమె ఆ మహాసభలను జయప్రదంగా నిర్వహించారు. ఆ మహాసభలు ఉత్సాహ భరితంగా జరిగినతీరు నాకిప్పటికీ బాగా జ్ఞాపకం. తూర్పు గోదావరిజిల్లా అరసంఅధ్యక్షురాలిగా ఆమె కొనసాగారు.
చిరంజీవినీకుమారి అరసం 14 వ రాష్ట్ర మహాసభలువిశాఖలో ఆమోదించిన నూతన ప్రణాళిక రచన కోసం ఏర్పాటైన కమిటీలో సభ్యురాలు. ఎన్నో సూచనలు, సలహా లతో ఆ ప్రణాళికను పరిపుష్టం చేశారు. అరసం రాష్ట్ర వ్యాపితంగా నిర్వహించిన అన్ని సదస్సులు, సభలలో ఆమె పాల్గొన్నారు. విద్యార్థిదశ నుంచీ ఆమెది వామపక్ష భావ జాలం. సామాజికఉద్యమకారిణిగా చివరివరకూ జీవించారు. శ్రీశ్రీ సప్తతి సభను మార్చి 1980లో కాకినాడలో ఘనంగా నిర్వహించి ఒక ప్రత్యేక సంచికనూ వెలు వరించారు. ఈ సభకు ప్రత్యేక ఆకర్షణ హరీంద్రనాధ్ చటోపాధ్యాయ. చిరంజీవినీకుమారి అరసంతో పాటు ఇస్కస్ జనవిజ్ఞానవేదిక, మహిళా సమాఖ్య వంటి సంస్థల తోనూ సన్నిహితంగా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ కార్యదర్శిగా, భారత సాక్షరతాసమితి ఆంధ్రప్రదేశ్ విభాగం ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు. చిరంజీవినీకుమారి జీవితంలో, ఆమె సాహిత్య చరిత్రలో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘం. ఈ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా చివరి వరకూ ఉన్నారు. ‘తూర్పుగోదావరి జిల్లా సాహిత్య చరిత్ర’ (1880ల నుంచి 2015 వరకు) పుస్తకాన్ని ప్రధాన సంపాదకురాలిగా 2018లో వెలు వరించారు. గోదావరికి అటు, ఇటు ఉన్న సాహిత్యకారుల ప్రశస్తి, వారి కృషి సాహిత్యం కలగలిపి ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ఇది తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఒక సమగ్ర సాహిత్యచరిత్ర. ఈ గ్రంథంలో ‘‘దిద్దుబాటు’’ కు ముందు కథలు’’ శీర్షికన చిరంజీవినీకుమారి వ్యాసం ఉంది. ఈ వ్యాసంలో దిద్దుబాటుకు ముందు గోదావరి జిల్లాల నుంచి వచ్చిన 28కథల జాబితాను ఇచ్చారు. కొంతమేరకు ఆ కథలు పరిచయం చేశారు. ఎంతో సమాచార విలువలతో కూడిన వ్యాసం ఇది. చిరంజీవినీకుమారి చేసిన మరొక మహత్తర కృషి తన భర్త పి.సి.శర్మ 1987లో సంకలనపరిచిన ‘భారత స్వాతంత్య్ర సమరాంగణంలో గోదావరితీరం’ రెండు సంపుటాలను 2022 ఆగస్ట్లో పునర్ముద్రించి మన జాతికి కానుకగా సమర్పించారు. ఇవి అపురూపచరిత్ర పుస్తకాలు. అన్ని చోట్లా ఉండదగినవి. చదవదగినవి. భారత మాజీ ప్రధాన పి.వి.నరసింహారావు రచించిన ‘గొల్లరామవ్వ’ కథపై అభిప్రాయమాలికను ఒక పుస్తకంగాఆగస్ట్ 2021లో సంకలనం చేశారు. ఇందులో నా వ్యాసం కూడా ఉంది. చిరంజీవినీకుమారి అనేక స్వీయ రచనలు చేశారు. ఇంకా బుక్స్ ఆఫ్ తెలుగు పొయిట్రీ, ఆర్మేనియా కథలు
గాధలను రచించారు. గోదావరి కథలుగాధలు, తూర్పుగోదావరి జిల్లా చరిత్ర సంస్కృతి పుస్తకాలను సంకలనం చేశారు. ఎన్నో వ్యాసాలు రాశారు మంచి వక్త. సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డును స్వీకరించారు. సోవియట్లో పర్యటించారు. విశాలాంధ్ర వారు తుమ్మల సాహితీ సత్కారాన్ని అందించారు. అరసం
గుంటురు జిల్లా శాఖ ఏప్రిల్ 2010లో ‘శత జయంతి సాహితీ మూర్తుల స్ఫూర్తి సదస్సు’ లో గుంటూరు వారిని ఘనంగా సత్కరించింది.
ఎం.ఏ, పీహెచ్డీ చేసిన వీరు ఎంఏ ఫిలాసఫీ చదివారు. బిఏ తెలుగులో స్వర్ణపతకాన్ని స్వీకరించారు. తరువాత కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఆంగ్లోపన్యాసకురాలిగా ఉద్యోగించారు. కాకినాడలో ఐడియల్ పేరుతో ఆదర్శవంతంగా విద్యాసంస్థలను నిర్వహించారు. కాకినాడ వెళ్లినప్పుడు చిరంజీవినీకుమారిని కలవడం ఒక బాధ్యత నాకు. వారిని చివరలో చూసింది, కలిసింది 17 నవంబర్ 2024 న కాకినాడ చల్లా కళ్యాణమండపంలో జరిగిన ఆవంత్స సోమసుందర్ శత జయంతి సభలో. ఎంతో ప్రేమతో మాట్లాడారు. అరసం విషయాలు అడిగి తెలుసుకొని ఆశీర్వదించారు.
కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ నాకు లభించిన తరువాత కాకినాడ వారి ఐడియల్ కళాశాలలో సత్కారం తలపెట్టారు. అయితే వారు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంగా కలవటం సాధ్యం కాలేదు. అయినా 19 ఏప్రిల్ 2025న ఆ ప్రాంగణంలో నాకు సత్కారం జరిగింది. ఆమె అందించిన తల్లి ప్రేమను నేను ఎన్నటికీ మరువలేను.
నిత్య చైతన్యశీలి, వేలాది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన విద్యాదాత, కాకినాడకు పర్యాయపదం కామ్రేడ్ పాలెపు చిరంజీవినీకుమారి. లేతమందారాలురక్త సిందూరాలు (32 మంది రష్యన్ రచయిత్రుల అనువాద కవితల సంకలనం) కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కీర్తి పురస్కారాన్ని పొందారు. పి. చిరంజీవినీకుమారి (జననం 30 మార్చి 1931
అమరత్వం 16
2025) కి అభ్యుదయ రచయితల సంఘం పక్షాన జోహార్లు.
(96
2025 సోమవారం కాకినాడలో సంస్మరణ సభ జరుగుతున్న సందర్భంగా…)