జులై 16న కేరళకు చెందిన నర్స్ నిమిష ప్రియకు యెమెన్లో ఉరిశిక్ష అమలు చేయనున్న సంగతి తెలిసిందే. ఆమెను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తోంది. అయితే తాజాగా ఓ కీలక అప్డేట్ వచ్చింది. నిమిష ప్రియకు పడిన ఉరిశిక్ష ఆపేందుకు భారత్ వద్ద పెద్దగా ఎలాంటి మార్గాలు లేవని కేంద్రం స్పష్టం చేసింది. సోమవారం సుప్రీంకోర్టుకు కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించింది.అడ్వకేట్ జనరల్ వెంకటరమణి అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేశారు. భారత్-యెమెన్ మధ్య దౌత్యపరంగా ఎలాంటి సంబంధాలు లేవు. ఉరిశిక్షను వాయిదా లేదా నిలిపివేయడం కుదురుతుందా అని ప్రాసిక్యూటర్కు లేఖ పంపించాం. యెమెన్కు సంబంధించిన ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం చేయగలిగింది ఎక్కువగా ఏమీ లేదు. దీన్ని దౌత్యపరంగా గుర్తించలేం. బ్లడ్ మనీ అనేది కేవలం ప్రైవేటు సంప్రదింపులు మాత్రమేనని వెంకటరమణి తెలిపారు.
అసలేంటి ఈ కేసు
నిమిష ప్రియ కేరళలో నర్సింగ్ కోర్సు పూర్తి చేసి 2008లో యెమెన్కు వెళ్లి అక్కడే జాబ్లో చేరింది. 2011లో కేరళకు వచ్చి థామస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత యెమెన్లోని ఓ క్లినిక్ను ప్రారంభించాలనుకుంది. అయితే ఆ దేశ రూల్స్ ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమవుతుంది. ఇందుకోసం నిమిష అక్కడున్న తలాల్ అదిబ్ మెహది అనే వ్యక్తిని వ్యాపార భాగస్వామిగా చేసుకుంది. వీళ్లద్దరూ కలిసి మెడికల్ కౌన్సిల్ సెంటర్ను ప్రారంభించారు. ఆ తర్వాత నిమిష తన కూతురు సంప్రదాయ వేడుక కోసం భారత్కు వచ్చింది. అది ముగిశాక యెమెన్కు వెళ్లిపోయింది.నిమిష భర్త, కూతురు మాత్రం కేరళలోనే ఉండిపోయారు. దీన్ని ఆసరగా చేసుకొని మెహది.. నిమిష ప్రియ నుంచి డబ్బు లాక్కునేవాడని, వేధించేవాడని ఆమె కుటుంబం ఆరోపించింది. ఆఖరికి ఆమె పాస్పోర్టును కూడా లాక్కున్నాడని చెప్పారు. దీంతో నిమిష.. తన పాస్పోర్టును స్వాధీనం చేసుకునేందుకు 2017లో మెహదికి మత్తుమందు ఇచ్చింది. కానీ డోస్ ఎక్కువైపోవడంతో అతడు మృతి చెందాడు. దీంతో అతడి మృతదేహాన్ని ఆమె వాటర్ట్యాంక్లో పడేసింది. చివరికి ఆమె సౌదీకి వెళ్తుండగా.. సరిహద్దుల్లో ఆమెను అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టు నిమిష ప్రియకు ఉరిశిక్ష విధించింది.
అయితే మృతుడి ఫ్యామిలీకి కొంత మొత్తాన్ని పరిహారంగా ఇస్తే దోషులను క్షమించి వదిలేసే అవకాశం యెమెన్లో ఉంది. ఇందుకోసం భారీ మొత్తంలో డబ్బు వారికి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే నిమిష ప్రియ కుటుంబం మిలియన్ డాలర్లు అంటే రూ.8.6 కోట్లు బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో నిమిష ఉరిశిక్షను ఆపేందుకు అవకాశం లేకుండా పోయింది.


