ఉత్తరప్రదేశ్ మీరట్ లో (Meerut Hospital) విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ వైద్యుడి నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైపోయింది. సమయానికి వైద్యం అందకపోవడంతో తీవ్ర రక్తస్రావంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సునీల్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని కుటుంబ సభ్యులు లాలా లజపతిరాయ్ మెమోరియల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆ సమయంలో విధుల్లో ఉన్న జూనియర్ డాక్టర్ వైద్యం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఏసీ వేసుకొని నిద్రపోయాడు (Doctor Sleeps In AC). బాధితులు ఎంత వేడుకున్నా నిద్రలేవలేదు. గాయపడిన సునీల్ను గంటలతరబడి ఎమర్జెన్సీ వార్డులో స్ట్రెచర్పై వదిలివేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగి అతడు మరణించాడు.వైద్యుడు ఏసీ ముందు టేబుల్ మీద కాలు పెట్టుకుని నిద్రిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అతడి సమీపంలోనే సునీల్ స్ట్రెచర్పై నొప్పిని తట్టుకోలేక అల్లాడుతూ కనిపించాడు. ఇవాళ ఉదయం 7 గంటల సమయంలో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది.ఈ ఘటనపై లాలా లజపతిరాయ్ మెమోరియల్ (LLRM) మెడికల్ కాలేజీ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ జూనియర్ రెసిడెంట్ డాక్టర్ భూపేశ్ కుమార్ రాయ్ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయడానికి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు మెడికల్ కాలేజీ అధికారులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.


