బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ భాషకు సీబీఐ అధికారులు శనివారం నోటీసులు ఇచ్చారు. అనుమానిత నిందితుడు సత్యం బాబుపై నమోదైన పలు సెక్షన్లపై అభిప్రాయం తెలపాలంటూ ఆయేషా మీరా తల్లిదండ్రులకు సీబీఐ అధికారులు నోటీసులు జారీచేశారు. అయితే, సీబీఐ నోటీసులను శంషాద్ బేగం, ఇక్బాల్ భాష తిరస్కరించారు. ఈ కేసుకు సంబంధించి జూన్లోనే దర్యాప్తు ముగిసింది అంటూ సీల్డ్ కవర్లో కోర్టుకు సీబీఐ అధికారులు నివేదిక సమర్పించారు . దర్యాప్తు ముగిసిన తర్వాత మళ్లీ నోటీసులు ఇవ్వడమేంటంటూ ప్రశ్నిస్తున్నారు ఆయేషా మీరా తల్లిదండ్రులు. అసలు దర్యాప్తు రిపోర్టులో ఏముందో తమకు కనీస సమాచారం ఇవ్వలేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.దర్యాప్తు వివరాల కాపీని తమకు వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు ఆయేషా మీరా తల్లిదండ్రులు. తాము ఏపీ ప్రభుత్వం ద్వారా సీబీఐని ఆశ్రయించామని, ఈ కేసులో ఏపీ ప్రభుత్వం బాధ్యత కూడా ఉందని వారు చెబుతున్నారు. సీబీఐ ద్వారా కూడా తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వెంటనే స్పందించాలని ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ భాష డిమాండ్ చేశారు.
ఆయేషా మీరా తల్లిదండ్రులకు సీబీఐ నోటీసులు
- Advertisement -


