నాలాల సమగ్ర అభివృద్ధితో ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న వరదముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారం కానున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రూ.45 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన బేగంపేట లోని నాలా అభివృద్ధి పనులను అధికారులతో కలిసి నేడు పరిశీలించారు, మయూర్ మార్గ్, బ్రాహ్మణవాడి లలో జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఎలక్ట్రికల్, టౌన్ ప్లానింగ్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. నాలాను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జీడిమెట్ల, బాలానగర్, పతే నగర్ ల మీదుగా ఉన్న బేగంపేట నాలాకు ఎగువ నుండి వచ్చే వరదముంపు సమస్యను పరిష్కరించేందుకు గాను బ్రాహ్మణవాడి, మయూర్ మార్గ్ మరియు ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్లోని కూకట్పల్లి నాలాపై రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, నీటి సరఫరా మరియు మురుగునీటి లైన్లను పునరుద్దరించడం వంటి పనులను చేపట్టనున్నట్లు తెలిపారు.