కేంద్ర మంత్రులకు పవన్ విజ్ఞప్తి
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించి అనేక కీలక అంశాలపై చర్చించారు. ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర గోడ నిర్మాణానికి సంబంధించి కాకినాడ జిల్లా యంత్రాంగం రూపొందించిన ప్రతిపాదనను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ముందు ప్రవేశపెట్టేందుకు అవకాశం కల్పించినందుకు అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. ఉప్పాడ సముద్ర గోడ ప్రాజెక్టు తీర ప్రాంత భూక్షయం నివారణకు, స్థానిక ప్రజల ప్రాణాలు, ఆస్తులు, జీవనోపాధులను రక్షించేందుకు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు అమలుతో తీర ప్రాంతాలకు దీర్ఘకాలిక భద్రత కల్పించడంతో పాటు విపత్తుల ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ భేటీ సానుకూలంగా సాగిందని, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు కేంద్రంతో సమన్వయం కొనసాగుతుందని ‘ఎక్్స’ వేదికగా పవన్ కల్యాణ్ తెలిపారు. అంతకుముందు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ శ్రీవైష్ణవ్తో సమావేశమయ్యారు. పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి, రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు అనేక అంశాలపై చర్చించారు. సేతు బంధన్ పథకం కింద మంజూరు చేసిన రోడ్డు ఓవర్ బ్రిడ్జిని పీఎం గతిశక్తి పథకం పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. పిఠాపురం ఆధ్యాత్మికంగా ముఖ్య పట్టణం అయినందున రైల్వే స్టేషన్ను అమృత్ స్కీం కింద మోడల్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చేయాలని కోరారు. వీటితో పాటు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అనేక రైల్వే ప్రాజెక్టుల గురించి చర్చించారు. అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించినందుకు పవన్ కల్యాణ్ కతజ్ఞతలు తెలిపారు.


