న్యూదిల్లీ: కువైట్ నుంచి దిల్లీ బయల్దేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టించింది. దీంతో విమానాన్ని అహ్మదాబాద్లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కువైట్ నుంచి దిల్లీ బయల్దేరిన ఇండిగో విమానం గాల్లో ఉన్న సమయంలో టాయిలెట్లోని ఓ టిష్యూ పేపర్పై విమానంలో బాంబు పెట్టినట్లు రాసి ఉన్న బెదిరింపు నోట్ని ఓ ప్రయాణికుడు గుర్తించి… సిబ్బందిని అప్రమత్తం చేశాడు. వెంటనే స్పందించిన పైలట్లు అహ్మదాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సమాచారం అందించి అత్యవసర ల్యాండింగ్ కోసం అభ్యర్థించారు. దీంతో విమానాశ్రయ అధికారులు ఫైర్ టెండర్లు, అంబులెన్స్లు సిద్ధంగా ఉంచారు. శుక్రవారం ఉదయం 6.40 గంటలకు అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. అనంతరం ప్రయాణికులను కిందకు దించేసి, విమానంలో తనిఖీలు చేశారు. ఘటన సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు.


