ముంబై : మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆకస్మిక మరణం తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్సీపీకి చెందిన రెండు వర్గాలు విలీనమయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి రెండో వారంలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రెండు వర్గాలను విలీనం చేసే ఉద్దేశంతో కొంత కాలంగా అజిత్ పవార్ తన బాబా య్ శరద్ పవార్తో అనేకమార్లు భేటీ అయ్యారు. ఆ వర్గానికి చెందిన సుప్రియా సూలే, జయంత్ పాటిల్తో కూడా చర్చలు జరిపారు. ఈ పరిణామాల గురించి సీనియర్ బీజేపీ నేతలకు సమాచారం ఇచ్చారని, ఆ వివరాలు వెల్లడించారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అజిత్ దుర్మరణంతో ఇప్పుడు పార్టీ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్న వారి జాబితాలో శరద్పవార్తో పాటు అజిత్ సతీమణి సునేత్ర పవార్, సీనియర్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, అజిత్ వర్గానికి చెందిన ప్రఫుల్ పటేల్ ఉన్నట్లు తెలుస్తోంది.
నేడు ఎన్సీపీ శాసనసభా పక్ష సమావేశం
అజిత్ పవార్ అకాల మరణం తర్వాత ఎన్సీపీని ముందుండి నడిపించేది ఎవరు అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఎన్సీపీ శాసనసభా పక్షం సమావేశమవుతోంది. ఈ సమావేశంలో శాసనసభ పక్ష నేతను ఎన్నుకోనున్నారు. అయితే అజిత్ పవార్ కుమారులు అంత ఆసక్తిగా లేకపోవడంతో ఆయన భార్య సునేత్రా పవార్నే నాయకురాలిగా ఎంచుకోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అజిత్ పవార్ నిర్వహించిన పోస్టులన్నీ ఎన్సీపీ తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ సీనియర్లు… ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్తో చర్చలు జరిపారు. అజిత్ పవార్ డిప్యూటీ సీఎంతో పాటు ఆర్థిక శాఖ, మరిన్ని శాఖలు నిర్వహించారు.
ఆ శాఖలన్నీ ఎన్సీపీ నిలబెట్టుకోవాలని భావిస్తోంది. 1999లో కాంగ్రెస్ నుంచి విడిపోయిన తర్వాత శరద్ పవార్ ఎన్సీపీని స్థాపించారు. అనంతరం అజిత్ పవార్ జులై 2023లో పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఆయన వర్గం అధికార మహాయుతిలో చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్uల్, దిలీప్ వాల్సే-పాటిల్ వంటి శరద్ పవార్ సన్నిహితులు కూడా అజిత్ పవార్ శిబిరంలో చేరారు. తాజాగా అజిత్ పవార్ చనిపోవడంతో తిరిగి కలిసిపోవాలని నేతలు భావిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఫిబ్రవరిలో ఎన్సీపీ వర్గాల విలీనం?
- Advertisement -


