మహిళా సమైక్య డిమాండ్
బుధవారం మహిళా సమైక్య ఆధ్వర్యంలో సిపిఐ ఆఫీస్ వద్ద ప్రెస్ మీట్ జరిగింది. పత్రికా విలేకరులను ఉద్దేశించి ఏపీ మహిళా సమైక్య రాష్ట్ర అధ్యక్షురాలు వి విజయలక్ష్మి మాట్లాడుతూ, వెంకటగిరి టౌన్ పరిధిలో నివాసం ఉంటున్న ఒక మైనర్ బాలికను మాయమాటలు చెప్పి లొంగదీసుకుని గర్భవతిని చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, వెంటనే అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో పనిచేసే మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేయడం దుర్మార్గమని అన్నారు. ఆ బాలికను గర్భవతిని చేయడమే కాకుండా ఆమె శీలానికి మధ్య వర్తులు ద్వారా ఇన్ని లక్షల ఇస్తామని వెలకట్టడం విషయాన్ని బయటకు తెలియకుండా చేయడం మరీ అన్యాయమని అన్నారు. ఆ బాలిక గత ఆరు నెలలుగా ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లోనే పనిచేస్తున్నట్టు మాకు సమాచారం తెలిసిందని తెలిపారు. బాలిక తల్లిదండ్రులను పోలీసుల్ని ఆశ్రయించనివ్వకుండా కొంతమంది మధ్యవర్తులు చేశారని అన్నారు. పోలీసుల్ని ఆశ్రయించ నివ్వకుండా చేసిన మధ్యవర్తుల పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. బాలికను గర్భవతిని చేసినటువంటి వ్యాపారిని వెంటనే అరెస్టు చేయాలని లేదంటే మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని అన్నారు. ఎక్కడ మహిళకు అన్యాయం జరిగితే అక్కడ మహిళా సమైక్య వారికి అండగా ఉండి పోరాడుతుందని అన్నారు. ఈ మైనర్ బాలికకు న్యాయం జరిగేంత వరకు మహిళా సమైక్య ఆధ్వర్యంలో పోరాటాలను కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్ మంజుల, సిపిఐ వెంకటగిరి నియోజకవర్గ కార్యదర్శి వడ్డీపల్లి చెంగయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కల్లూరు జాన్, సిపిఐ పట్టణ కార్యదర్శి డక్కిలి శివకుమార్, మహిళా సమైక్య జిల్లా సమితి సభ్యులు ప్రమీల, పార్వతి, వనిత తదితరులు పాల్గొన్నారు.