ఆధార్ కార్డుదారులకు యూఐడీఏఐ ఒక గుడ్న్యూస్ చెప్పింది. ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు విధించిన గడువును మరో పూర్తి ఏడాది పాటు పొడిగించింది (Free Updates Extended One Year) . వాస్తవానికి ఈ అవకాశం త్వరలో ముగియనుండగా, పౌరుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఐడీఏఐ తెలిపింది. తాజా ఉత్తర్వుల ప్రకారం 2027 జూన్ 14 వరకు myAadhaar పోర్టల్ ద్వారా డాక్యుమెంట్లను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ నెల 13న విడుదల చేసిన అధికారిక మెమోరాండం ప్రకారం యూఐడీఏఐ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. “ఈ సదుపాయాన్ని మరో ఏడాది, అంటే 2026 జూన్ 15 నుంచి 2027 జూన్ 14 వరకు పొడిగించాలని నిర్ణయించాం. దీని ప్రకారం myAadhaar పోర్టల్లో డాక్యుమెంట్ అప్డేట్ సౌకర్యం 2027 జూన్ 14 వరకు ఉచితంగా కొనసాగుతుంది” అని ఆ ప్రకటనలో స్పష్టంగా పేర్కొన్నారు. పౌరులు తమ వివరాలను కచ్చితంగా అప్డేట్ చేసుకోవడాన్ని ప్రోత్సహించడమే ఈ పొడిగింపు ఉద్దేశమని తెలిపింది.
డాక్యుమెంట్ అప్డేట్తో పాటు యూఐడీఏఐ మొబైల్ యాప్లో కూడా కీలక మార్పులు చేసింది. పాత ‘mAadhaar’ యాప్ను త్వరలో నిలిపివేయనున్నట్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ ద్వారా ప్రకటించింది. దాని స్థానంలో వినియోగదారుల కోసం మెరుగైన ఫీచర్లతో కొత్త ‘Aadhaar app’ను అందుబాటులోకి తెచ్చింది. సురక్షితమైన క్యూఆర్ కోడ్ ఆధారిత ఆధార్ షేరింగ్, మెరుగైన ప్రైవసీ నియంత్రణలు, ఇతర ఆధార్ సేవలను సులభంగా పొందేందుకు ఈ కొత్త యాప్ వీలు కల్పిస్తుంది.
కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కొత్త ఆధార్ యాప్కు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. కేవలం మూడు నెలల్లోనే ఈ యాప్ను 2.1 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పటివరకు ఈ యాప్ ద్వారా 28 లక్షల మంది తమ మొబైల్ నంబర్లను, దాదాపు 6 లక్షల మంది తమ చిరునామాలను అప్డేట్ చేసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ కొత్త యాప్ ఆండ్రాయిడ్, యాపిల్ ఐఓఎస్ ప్లాట్ఫామ్లపై అందుబాటులో ఉంది.


