ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా కలవరం మొదలైంది. ముఖ్యంగా చైనాతోపాటు ప్రపంచంలోని పలు దేశాల్లో మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దీంతో భారత్లోనూ కరోనా నాలుగో వేవ్ భయం ప్రజలను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసులు పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తూ.. దేశంలో కొవిడ్ వ్యాప్తిని పరిశీలిస్తోంది. కొవిడ్ టెస్టులు, క్వారంటైన్ సదుపాయాలు, వ్యాక్సిన్ మొదలుకొని ఆసుపత్రుల్లో చేయాల్సిన ఏర్పాట్లపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేస్తోంది.