కీలక నేత ఆశన్న సహా 208 మంది లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమానికి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.మావోయిస్టుల అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న అలియాస్ రూపేశ్తో పాటు అభూజ్మఢ్ ప్రాంతం సహా సుమారు 208 మంది నక్సలైట్లు శుక్రవారం బస్తర్ జిల్లా జగ్దల్పూర్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు.లొంగుబాటు సందర్భంగా వారు తమ వద్ద ఉన్న సుమారు 153 ఆయుధాలను స్వచ్ఛందంగా సమర్పించి, కేంద్ర హోంశాఖకు అప్పగించి జనజీనవ స్రవంతిలో కలిసిపోయారు.
దీంతో దక్షిణ బస్తర్ ప్రాంతాన్ని మినహాయిస్తే, మిగతా ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని అధికారులు తెలిపారు.ఇప్పటి వరకు జరిగిన లొంగుబాట్లలో ఇది మావోయిస్టు చరిత్రలోనే అత్యంత పెద్ద లొంగుబాటుగా పరిగణించబడుతోంది.
మహారాష్ట్రలో 60 మంది అనుచరులతో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్
ఈ కార్యక్రమంలో సమర్పించిన ఆయుధాలలో 19 ఏకే-47 రైఫిళ్లు, 17 ఎస్ఎల్ఆర్లు, 23 ఇన్సాస్ రైఫిళ్లు, 36 త్రీ-నాట్-త్రీ (303) రైఫిళ్లు, 41 సింగిల్ షాట్ గన్స్, 11 బీజీఎల్ లాంచర్లు, 4 కార్బైన్లు, 1 లైట్ మెషీన్ గన్, ఒక పిస్టల్ ఉన్నాయి. ఇదే సమయంలో, రెండు రోజుల క్రితం మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ తన 60 మంది అనుచరులతో కలిసి మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలో పోలీసుల ఎదుట లొంగిపోయారు.దీనికి కొనసాగింపుగానే ఆశన్న కూడా తొంగిపోతున్నట్టు ప్రకటించారు.
నక్సల్స్ లొంగుబాటుకు సంబంధించి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి మధ్యాహ్నం 12 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించారు.


